రోడ్డు మీద దిగిన ఎయిర్ఫోర్స్ ఫైటర్ మిరాజ్ విమానం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమున ఎక్స్ప్రెస్ వేమీద ఒక ఎయిర్ఫోర్స్ పైటర్ మిరాజ్ విమానం దిగింది. ఇది అత్యావసర ల్యాండింగ్ అని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్స్ప్రెస్ వేపై విమాన ల్యాండింగ్ను పరీక్షించేందుకే ల్యాండింగ్ జరిపి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తొలిసారిగా ఓ విమానం రోడ్డుపై విజయవంతంగా దిగింది.
హైవేపై విమానం ప్రాక్టీస్ అప్రోచ్ పద్ధతిని అనుసరించింది. రోడ్డుపై దిగడానికి ముందు విమానం 100 మీటర్ల ఎత్తుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యమున ఎక్స్ప్రెస్ వే అథారిటీ, జెపి ఇన్ఫ్రాటెక్, సివిల్ పోలీసుల సహకారంతో ఈ ప్రయోగం విజయవంతంగా జరిగినట్లు ఐఎఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత వైమానిక దళం (ఐఎఎఫ్) భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాలు మరిన్ని చేయాలనే ఉద్దేశంతో ఉంది. మిరాజ్ - 2000 గురువారం ఉదయం 6.40 గంటలకు రోడ్డుపై దిగింది. కొద్ది సేపు రోడ్డు మీద ఉన్న తర్వాత అది తిరిగి గాలిలోకి లేచి వెళ్లిపోయింది.
అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై విమానాలను దించడానికి వీలవుతుందా, లేదా అనే తేల్చుకోవడానికి ఇది ప్రాక్టీస్ డ్రిల్ అని అధికార వర్గాలు అంటున్నాయి. విమానం దిగిన ఆరు లేన్ల యమున ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ శివారులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాను కలుపుతుంది. ఈ విమానం దిగిన సమయంలో హైవేపై ట్రాఫిక్ను కొద్ది గంటల పాటు నిలిపేశారు.