కేరళ వరదలు: మూటలు మోసిన ఐఏఎస్ అధికారి, 8 రోజులు గుర్తు పట్టలేదు, హీరో !
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కేరళ చేరుకున్న పలు స్వచ్చంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గోని స్థానికులకు సహాయం చేస్తున్నారు. కేరళలోని సహాయక శిభిరంలో ఓ ఐఏఎస్ అధికారి 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు.
కేరళలో వరద కారణంగా చెంగన్నూర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. చెంగన్నూరులోని సహాయక కేంద్ర వద్ద సాటి వాలంటీర్ లతో పాటు ఓ యువకుడు 8 రోజుల పాటు అక్కడ ట్రక్కులో వచ్చిన మూటలు మోస్తున్నాడు. మూటలు కిందకు దించి అవసరమైన వారికి అతను అందిస్తున్నాడు.
అనుమానంతో అధికారి
ఇలా 8 రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు ఆ యువకుడి దినచర్య మూటలు మోయడమే. 9వ రోజు ఓ అధికారి ఆయువకుడిని దగ్గరగా పరిశీలించి ఆశ్చర్యానికి గురైనారు. సార్ మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడే మూటలు మోస్తున్నారా ? అని అధికారి ప్రశ్నించారు.
స్థానికులకు షాక్
ఒక అధికారి ఆ యువకుడిని సార్ అని పిలవడంతో సాటి వాలంటీర్లు ఏమిటి విషయం అని ఆరా తీశారు. గత ఎనిమిది రోజుల నుంచి తమతో పాటు మూటలు మోసింది ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ అని తెలుసుకుని షాక్ కు గురైనారు.
సెల్ఫీలు
వాలంటీర్లతో పాటు పునరావాస కేంద్రంలో ఉన్న స్థానికులు ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ దగ్గరకు చేరుకుని పోటీ పడి సెల్ఫీలు తీసుకున్నారు. మీరు వాలంటీర్ గా పని చెయ్యడం ఏమిటి సార్ అని ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ మీడియా ప్రశ్నించింది.
నిజమైన హీరోలు
ఇక్కడి అధికారులు, చేపలు పట్టేవారు, స్వచ్చంద సంస్థల కార్యకర్తల కష్టంతో పోల్చుకుంటే తాను ఏమీ గొప్ప పని చెయ్యలేదని అనిపిస్తోందని కన్నన్ గోపినాథన్ అన్నారు. తాను వాలింటర్ గా పని చేశానని ప్రచారం చేసే కంటే స్థానిక అధికారులు, సిబ్బంది శ్రమను ప్రచారం చెయ్యాలని, వారే నిజమైన హీరోలని, అందరూ ఇదే స్పూర్ఫితో కష్టపడితే కేరళ త్వరగా కోలుకుంటుందని ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతం
2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కన్నన్ గోపినాథన్ కు కేంద్రపాలిత ప్రాంతం అయిన దాద్రానగర్- హవేలీలో పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి దేశం మొత్తం ముందుకు వచ్చింది.
సీఎంకు చెక్ ఇవ్వాలని !
కేంద్ర పాలిత ప్రాంతం అయిన హవేలీ సైతం కేరళకు రూ. ఒక కోటి విరాళం ఇచ్చింది. కోటి విరాలం చెక్కు సీఎంకు అందించడానికి ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ తిరువనంతపురం వెళ్లారు. సెలవు మీద వెళ్లిన కన్నన్ గోపినాథన్ పని ముగించుకుని కేరళలోని సొత ఊరు అయిన పుతుపల్లికి వెళ్లాలి.
సెలవు కాదు సేవలు
కేరళ సీఎంను కలిసిన తరువాత ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ నేరుగా బస్సులో చెంగన్నూరు వెళ్లి 8 రోజుల పాటు వాలంటీర్ గా పని చేశారు. హావేలీకి వెళ్లి విధుల్లో చేరిన కన్నన్ గోపినాథన్ తాను 10 రోజులు సెలవు మీద ఊరికి వెళ్లానని, సెలవు మంజూరు చెయ్యాలని ప్రభుత్వానికి మనవి చేశారు. అయితే కన్నన్ గోపినాథన్ సెలవులో వెళ్లలేదని, కేరళలో వాలంటీర్ గా పని చేశారని ఆయన మనవిని ప్రభుత్వం తోసిపుచ్చింది. కన్నన్ గోపినాథ్ సేవలను దేశం మొత్తం అభినందిస్తోంది.