హసన్ జిల్లా నుంచి బదలీ, పోరాడినా 'తెలుగు' అధికారి రోహిణి సింధూరికి నిరాశ
బెంగళూరు: హసన్ జిల్లా అధికారి రోహిణీ సింధూరి దాసరిని మైసూరు జిల్లాధికారిగా బదలీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సెంట్రల్ ట్రైబ్యునల్ అప్పీలేట్ మంగళవారం సమర్థించింది. మైసూరు జిల్లా అధికారిగా తక్షణమే బాధ్యతలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
నెల రోజులుగా పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న అప్పటి మైసూరు జిల్లా అధికారి రందీప్ను తక్షణమే హసన్ జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టాలని న్యాయాధికారి ఆదేశించారు. తాను హసన్ జిల్లాధికారిగా బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు మాత్రమే అయిందని, ఇప్పుడు మైసూరుకు బదలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ రోహిణీ సింధూరి తొలుత ఉన్నత న్యాయస్థానాన్ని, అనంతరం సీఏటీని గడప తొక్కారు.
ఆర్టీ రిట్ దాఖలు చేస్తాం
ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఆమెను బదలీ చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిని పరిగణలోకి తీసుకోలేదని రోహిణి తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు. నిబంధనలకు అనుగుణంగానే రోహిణి బదలీ జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. మరోవైపు సీఏటీ ఆదేశాలను ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానంలో గురువారం రిట్ అర్జీ దాఖలు చేస్తామని రోహిణి న్యాయవాది తెలిపారు.
రోహిణి సింధూరి నిరాశ
సెంట్రల్ ట్రైబ్యునల్ అప్పీలేట్ ఆదేశాల నేపథ్యంలో నిరాశకు గురైన రోహిణి సింధూరి మంగళవారం తన నివాసానికే పరిమితం అయ్యారు. నెలన్నర రోజులుగా హసన్ జిల్లా అధికారిగా కొనసాగుతుండటంతో మైసూరు నుంచి రిలీవ్ అయిన రందీప్ ఖాళీగా ఉన్నారు. సెంట్రల్ ట్రైబ్యునల్ అప్పీలేట్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఆయన హసన్ చేరుకొని జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ఐపీఎస్ అధికారుల బదలీ
కాగా, ఎన్నికల సంఘం సూచన మేరకు ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికారులు బదలీ చేయాలంటూ ఎన్నికల సంఘం సూచనలు చేసింది.
అధికార పక్ష నేతలకు చుక్కలు
రోహిణి సింధూరి దాసరి 2009 బ్యాచ్ ఐఏఎస్ యూపీఎస్సీలో 43వ ర్యాంకు సాధించారు. ఆమె కర్నాటకలో అధికార పక్షానికి చుక్కలు చూపించారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక ఇంచార్జ్ మినిస్టర్ ప్రభుత్వ ఆఫీసులను ఉపయోగించుకోవద్దు. కానీ పీడబ్ల్యూడీ ఇన్స్పెక్షన్ బంగ్లాను ఆఫీసుగా మార్చుకున్నాడని తెలియడంతో ఆమె సీజ్ చేశారు. నోటీసులు ఇచ్చారు. ఇలా అమె తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరికైనా కంటిలో నలుసుగా మారారు.