ఐసీఐసీఐ బ్యాంక్ కేసు: విచారణాధికారిపై సీబీఐ బదిలీ వేటు..రహస్యమేంటి..?
Recommended Video
అవినీతి ఆరోపణల నెపంతో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్వర్మను ఆ పదవి నుంచి తొలగించి కొన్ని రోజులు గడవకముందే తాజాగా మరో కీలక కేసును విచారణ చేస్తున్న అధికారిపై సీబీఐ బదిలీ వేటు వేసింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ మాజీ బాస్ చందాకొచ్చర్తో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేసిన విచారణాధికారిని బదిలీ చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ఎస్పీ సుధాన్షు ధార్ మిశ్రా విచారణ చేస్తున్నారు. కేసుకు సంబంధించి సెర్చ్ ఆపరేషన్లు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారో అనేదానిపై ముందుగానే సంబంధిత వ్యక్తులకు సమాచారం లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన్ను బదిలీ చేసింది సీబీఐ.
విచారణాధికారి బదిలీ చేసిన సీబీఐ
ఐసీఐసీఐ వీడియోకాన్ కేసును విచారణ చేస్తున్న ఎస్పీ సుధాన్షు ధార్ మిశ్రాను రాంచీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీబీఐ. ఐసీఐసీఐ మాజీ బాస్ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మిశ్రాను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసును విచారణ చేయాల్సిందిగా కొత్త అధికారి మోహిత్ గుప్తాను సీబీఐ నియమించింది. బాధ్యతలు చేపట్టగానే మోహిత్ గుప్తా నేతృత్వంలోని బృందం పలుచోట్ల దాడులు, సోదాలు నిర్వహించింది.
సమాచారం లీక్ చేశారా..?
కేసును ముందుగా విచారణ చేస్తున్న మిశ్రా వైఖరిలో కాస్త తేడాగా ఉందని గుర్తించడంతోనే ఆయనపై బదిలీ వేటు వేశామని సీబీఐ సమర్థించుకుంది. ప్రాథమిక విచారణ పెండింగ్లో ఉంచారని అందుకు సరైన కారణాలు లేవని సీబీఐ వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్టేట్మెంట్ సీబీఐ చేయలేదు. ఐసీఐసీఐ కేసు ఓ ముఖ్యమైన కేసుగా అభివర్ణించిన ఓ అధికారి ప్రాథమిక విచారణ చేపట్టకుండా ఎందుకు జాప్యం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అందుకే మిశ్రాను బదిలీ చేశామని వెల్లడించారు.
విచారణ జాప్యం చేస్తున్నారని తెలిసినా అతన్నే ఎందుకు కొనసాగించారు..?
ఇదిలా ఉంటే కేసుకు సంబంధించి జరగబోయే సెర్చ్లపై సమాచారం లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సీబీఐ అధికారి వెల్లడించారు. అందుకే అనుమానం రావడంతో సుధాన్షు మిశ్రాపై విచారణ చేశామని వెల్లడించారు. ఇంత సీరియస్ కేసులో ప్రాథమిక విచారణ ఎందుకు పెండింగ్ పెట్టారని ప్రశ్నించగా ఆయన దగ్గర సరైన కారణం లేకపోవడంతో కేసు విచారణ నుంచి తప్పించి రాంచీకి బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఈయనతో పాటు ఇంకెవరైనా అధికారులు ఇలా ఉన్నారా అనేదానిపై కూడా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రాథమిక విచారణలో జాప్యం చేస్తున్నారని సీబీఐ దృష్టికి వచ్చినప్పటికి కూడా మిశ్రాను ఎలా కొనసాగించారు... ఆయనే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయగలిగారు అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు అధికారులు. అంతేకాదు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక ఈ కేసుకు సంబంధించిన పై అధికారి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే ఏ అధికారి దీనికి ఆమోద ముద్ర వేశారో అనేదానిపై కూడా సీబీఐ స్పష్టత ఇవ్వలేదు.
క్విడ్ ప్రొ కో పై అభియోగాలు నమోదు
ఇదిలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా ఉన్న సమయంలో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూపునకు రూ.1875 కోట్లు రుణం మంజూరు చేసింది. అయితే లోను మంజూరు చేసినందుకు గాను చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ స్థాపించిన ఎన్యూపవర్ రెన్యూవబుల్స్లో పెట్టుబడులు పెట్టారు. దీన్నే క్విడ్ప్రోకో కింద పరిగణిస్తూ అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారుల పేర్లు కూడా నమోదు చేసింది సీబీఐ. ప్రస్తుతం ఐసీఐసీఐ సీఈఓ సందీప్ బక్సీ పేరు కూడా చేర్చింది. ఈయనతో పాటు పలువురు బ్యాంకు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది సీబీఐ.