పిజ్జా ఇంటికే వస్తోంది.. రేషన్ ఎందుకు వద్దు: కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో రేషన్ హోం డెలివరీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేషన్ మాఫియాకు తలొగ్గే కేంద్రం రేషన్ డోర్ డెలివరీకి మోకాలడ్డుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయం పిజ్జా డెలివరీకి అనుమతించినప్పుడు రేషన్కు ఎందుకు అనుమతించరని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కేంద్రం అడ్డుపడుతోందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే రేషన్ మాఫియా ఎంత శక్తిమంతమైందో తెలుస్తోందని అన్నారు. కేవలం కొన్ని వారాల్లోనే తమ పథకాన్ని నిలిపివేయించే స్థాయిలో ఉన్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. డోర్ డెలివరీ పథకం అమలుకు కేంద్రం అనుమతి తీసుకోలేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఐదుసార్లు అనుమతి తీసుకున్నామని తెలిపారు.

చట్టపరంగా చూస్తే అసలు కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీజీ.. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించండి. ఆ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను. రేషన్ తమ పార్టీకో లేక బీజేపీకో చెందింది కాదు. మోడీ, కేజ్రీవాల్ ఇద్దరూ కలిసి రేషన్ అందిస్తున్నారని ప్రజలు భావిస్తారు. 70 లక్షల మంది లబ్ధిదారుల తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నా.. పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించండి అంటూ కేజ్రీవాల్ కోరారు.
కాగా, డోర్ డెలివరీ పథకం ప్రారంభించే యోచనతో ఒకట్రెండు రోజుల్లో ఆప్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రెండు కారణాల రీత్యా తక్షణమే ఆమోదించలేమంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ఫైలును వెనక్కి పంపారు. ఈ పథకానికి కేంద్రం ఇంకా ఆమోదం తెలపకపోవడం ఒక కారణమైతే, కోర్టులో కేసు ఉండటం మరో కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై కేజ్రీవాల్ తోపాటు ఆమ్ ఆద్మీపార్టీ నేతలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications