అది బీజేపీ నిర్ణయించాలి... ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ వ్యవహారంపై నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి చెక్ పెట్టడమే లక్ష్యంగా బరిలో దిగి... దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసింది లోక్ జనశక్తి పార్టీ. జేడీయూకి పోల్ అవాల్సిన ఓట్లను ఆ పార్టీ భారీగా చీల్చింది. ఎల్జేపీ దెబ్బతో ఒకరకంగా బిహార్లో జేడీయూ-బీజేపీ స్థానాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో 53 స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 74 స్థానాలు సాధించగా... గత ఎన్నికల్లో 70 స్థానాలు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితమైంది. నితీశ్ను దెబ్బకొట్టేందుకు ఎల్జేపీని తమ బి టీమ్గా బరిలో దింపి... బీజేపీయే ఈ గేమ్ ప్లాన్ అమలుచేసిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి నితీశ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత మొదటిసారి గురువారం(నవంబర్ 12) ఆయన మీడియాతో మాట్లాడారు.
'ఎల్జేపీపై ఏవైనా చర్యలు తీసుకోవాలంటే... అది బీజేపీనే తీసుకోవాలి. ఎల్జేపీని ఎన్డీయేలో కొనసాగించాలా వద్దా అన్నది బీజేపీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది.' అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. 'మేము మొత్తం ఎన్డీయే తరుపున ఎన్నికల్లో ప్రచారం చేశామన్నది నిజం. కానీ అభ్యర్థులు కూడా దొరకని ఓ పార్టీ కేవలం మా ఓట్లు చీల్చేందుకే ఎన్నికల్లో పోటీ చేసింది. ఇదంతా కనిపిస్తూనే ఉంది. మీడియా చెప్తూనే ఉంది... మా విశ్లేషణలు ఇంకా సాగుతున్నాయి...' అని నితీశ్ తెలిపారు.
Recommended Video
సీఎంగా మళ్లీ నితీశే బాధ్యతలు చేపడుతారని బీజేపీ స్పష్టం చేయగా.. దీపావళి తర్వాత ఆయన ప్రమాణస్వీకారం ఉండవచ్చునన్న కథనాలు వచ్చాయి. కానీ ప్రమాణస్వీకారం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని నితీశ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్డీయేలోని నాలుగు పార్టీలు సమావేశం కాబోతున్నాయన్నారు. తక్కువ సీట్లు సాధించి సీఎం కుర్చీలో కూర్చోబోతుండటం ఇబ్బంది అనిపించట్లేదా అన్న ప్రశ్నకు... 'ఈ తీర్పుతో వచ్చిన ఇబ్బందేముంది... ప్రజలు ఎన్డీయేకి పట్టం కట్టారు... కాబట్టి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఒక విషయం సుస్పష్టం.. నేనెప్పుడూ వ్యక్తిగతం సీఎం కుర్చీ కోసం పాకులాడలేదు. ఎన్డీయే ఏ నిర్ణయం తీసుకుంటే... అదే జరుగుతుంది.' అని బదులిచ్చారు.