హ్యాకింగ్ నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సిందే: ‘పెగాసస్’ సుప్రీంకోర్టు, కీలక సూచన
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశం పార్లమెంటులో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు, గురువారం పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే.. ఈ వ్యవహారం చాలా తీవ్రమైందవుతుందని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
అంతేగాక, పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం జరగనున్న విచారణకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులు ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిపింది. ఫోన్ల ట్యాపింగ్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడతారని తెలుసని, కానీ, ప్రభుత్వ విధానాలను విభేదించే వారిపై జరుగుతోందని విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇది రాజ్యాంగ నిబద్దత, నేరతత్వానికి సంబంధించిందని కోర్టుకు తెలిపారు.
కాగా, పార్లమెంటు సమావేశాలకు ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం ఓ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెగాసస్ లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికిపైగా భారతీయులుండగా, వీరిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు ఉన్నారని మీడియా కథనం పేర్కొంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు ఫోన్లూ హ్యాకింగ్ జాబితాలో కనిపించినట్లు సమాచారం.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోక్సభ, రాజ్యసభల్లోనూ కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి. అయితే, పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేస్తోంది. హ్యాకింగ్ జరగనప్పుడు విచారణ ఎలా చేస్తామని వ్యాఖ్యానిస్తోంది.
కాగా, పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు చేస్తూ కార్యకలాపాలకు విఘాతం కలిగించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రతిపక్షాలు అవమానపరుస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. కాగా, పార్లమెంటు సమావేశాలు వాయిదాలు పడుతూ నడుస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగని కారణంగా రూ. 130కుపైగా ప్రజాధనం వృథా అయ్యాయంటూ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications