గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్: కర్ణాటకలో మిషన్ భగీరథ: మార్మోగుతున్న కేసీఆర్, బీఆర్ఎస్..!!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతకస్థాయికి చేరుకుంటోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు జనంలోకి వెళ్తోన్నారు. విస్తృతంగా పర్యటనలు నిర్వహిస్తోన్నారు. హామీలు గుప్పిస్తోన్నారు.
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది.. పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యూలర్) తమ ప్రచార తీవ్రతను పెంచాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలు, చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిస్తోన్నారు. హామీలను గుప్పిస్తోన్నారు.
త్వరలో షెడ్యూల్..
ఈ నెల చివరివారం లేదా మార్చి మొదటివారంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
గుజరాత్ వర్సెస్ తెలంగాణ
ఈ ప్రచార కార్యక్రమంలో గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్ తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుసగా రెండోసారి కూడా తాము అధికారంలోకి వస్తే- గుజరాత్ మోడల్ ను అమలు చేస్తామంటూ అధికార బీజేపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్.. దీనిపై ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ఈ నినాదాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు.
తెలంగాణ తరహా పాలన..
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామి- తెలంగాణ మోడల్ ను తెర మీదికి తీసుకొచ్చారు. కీలక హామీలను ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే- తెలంగాణ తరహా పరిపాలనను అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి అమలు చేస్తోన్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను కర్ణాటకలోనూ ప్రవేశపెడతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ఆయన ఏకరువు పెట్టారు.
సంక్షేమ రథసారథి..
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవ్వాళ కుమారస్వామి రాయచూర్ లో పర్యటించారు. రోడ్ షోలో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుజరాత్ మోడల్ ను అమలు చేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారని, తాము తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ తరహాలో అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ సంక్షేమ రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
మిషన్ భగీరథ..
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను లూటీ చేస్తున్నాయని కుమారస్వామి ఆరోపించారు. రాయచూర్ ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని, ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేకపోయిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే- ఈ ప్రాంతం ఎదుర్కొంటోన్న నీటి కొరతను తీర్చడానికి మిషన్ భగీరథ ప్రాజెక్టును అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కింద- తెలంగాణలోని ప్రతి ఇంటికి అక్కడి ప్రభుత్వం నీళ్లను అందిస్తోందని, ఇలాంటి పథకాలు ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని కాళేశ్వరం పథకం దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఒక కేస్ స్టడీ కావాలని కుమారస్వామి చెప్పారు.