క్లీన్ గంగా ప్రాజెక్టులో మీరు భాగస్వాములు కావాలంటే ఏటీఎంలకు వెళ్లండి
భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన నది గంగా నది. గంగా నదిని శుభ్రం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది సెంటిమెంటుతో కూడుకున్నదే కాదు.. జాతికి గౌరవం కూడా. గంగానది పరిశుభ్రతలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. గంగా నదిని శుభ్రం చేయడమంటే మామూలు కష్టంతో కూడుకున్న పని కాదు. ఇందుకు ఖర్చు కూడా ఎంతో అవుతుంది. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక అవగాహనకు వచ్చింది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ATMలలో క్లీన్ గంగా ఫండ్ పేరుతో ఓ ఆప్షన్ ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని ఉద్దేశం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కాదని... కేవలం పవిత్రమైన గంగానది శుభ్రపరచడంలో వారిని భాగస్వామ్యం చేసేందుకే అని క్లీన్ గంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ తెలిపారు. చాలామంది విరాళాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది ఏటీఎంల ద్వారా సాధ్యం అవుతుంది.
గంగానదిని శుభ్రం చేయాలంటే దీనికి సుమారు రూ.20వేల కోట్లు అవుతుందని అంచనా వేసింది కేంద్ర జలవనరుల శాఖ. అయితే క్లీన్ గంగా ఫండ్ మాత్రం ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన అకౌంట్గా పరిగణిస్తారు. పెద్ద కార్పోరేట్స్, పారిశ్రామికవేత్తలు ఇతర ప్రజలు విరాళాలు ఇస్తారు. ఇప్పటి వరకు క్లీన్ గంగా ప్రాజెక్టు కోసం విరాళాల రూపంలో రూ.250 కోట్లు జమైయ్యాయి.దీన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా పర్యవేక్షిస్తోంది.
ఏటీఎం ద్వారా విరాళాలు ఎలా తీసుకురావాలో చర్చలు జరుపుతున్నట్లు NMCG ఆర్థిక విభాగం డైరెక్టర్ రోజీ అగర్వాల్ తెలిపారు.ఇప్పటికే ఎస్బ్యాంక్తో ఒప్పందం కుదిరిందని యస్ బ్యాంక్ ఏటీఎంలలో నది పరిశుభ్రతపై ఆప్షన్ డిస్ప్లే అవుతుందని చెప్పారు. అయితే క్లీన్ గంగా ప్రాజెక్టులో ఒక సామాజిక బాధ్యత ఇమిడి ఉన్నందున పన్ను మినహాయింపు కూడా ఉంటుందన్నారు. క్లీన్ గంగా ప్రాజెక్టులో భాగంగా...ఘాట్స్ శుభ్రపరిచడం, శ్మశాన వాటికల నిర్మాణం, ప్లాస్టిక్ తొలగింపు, ఇంకా ఇతర చెత్తను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 90 శాతం విరాళాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల నుంచి వస్తున్నాయని లోక్సభ సమాచారం ద్వారా తెలుస్తోంది.ఇప్పటి వరకు రూ.250 కోట్లు రాగా... మరో రూ.225 కోట్లు కేంద్రం శాంక్షన్ చేసిందని అగర్వాల్ చెప్పారు.