మార్పు కావాలంటే నాకే ఓటేయండి.. శశిథరూర్ రిక్వెస్ట్
కాంగ్రెస్ అధ్యక్ష పదవీ రేసులో శశిథరూర్తోపాటు మల్లికార్జున ఖర్గే ఉన్నారు. గెహ్లట్ తప్పుకోవడంతో ఖర్గే, దిగ్విజయ్ లైన్లోకి వచ్చారు. అయితే గాంధీయేతరులు పదవీ చేపట్టనుండటంతో.. ఎవరు అధ్యక్ష పదవీ చేపడతారననే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గెహ్లట్ అయితే గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉండేవారు. కానీ రాజస్థాన్ సంక్షోభం నేపథ్యంలో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు థరూర్, ఖర్గే, దిగ్గీ మధ్య పోటీ ఉండనుంది. థరూర్, ఖర్గే మధ్య టఫ్ ఫైట్ నడవనుంది. ఈ క్రమంలో శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గేతో తన పోటీ ఓ యుద్ధం అని భావించొద్దని అన్నారు. తామిద్దరూ భిన్న దృక్పథాలకు చెందిన వారిమని తెలిపారు. తమలో విజేత ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిర్ణయిస్తారని శశిథరూర్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ చెప్పేదొక్కటే అని మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై సంతృప్తి చెందితే దయచేసి ఖర్గేకు ఓటేయాలని కోరారు. మార్పు కోరుకుంటే తనకు ఓటేయాలని రిక్వెస్ట్ చేశారు. పార్టీ వ్యవహార సరళి నచ్చనివారు తనను ఎంచుకోవాలని కోరారు. పార్టీలో మార్పు తీసుకువచ్చేందుకు తను సిద్ధమేనని స్పష్టంచేశారు. సిద్ధాంతపరమైన సమస్యలేమీ లేవని పేర్కొన్నారు.
సోనియా గాంధీకి అనారోగ్య సమస్యలు ఉండటం.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు ససేమిరా అంగీకరించకపోవడంతో అధ్యక్ష పదవీకి ఎన్నిక జరగనుంది. తమ కుటుంబం నుంచి ఎవరూ బరిలో ఉండరని రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టంచేశారు.