ఐదు సెకన్లలోనే కరోనా తేలిపోతుంది: అదే ఎక్స్రే స్కాన్ సాఫ్ట్వేర్, రూర్కీ ప్రొఫెసర్ సృష్టి
న్యూఢిల్లీ: తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్తో ఎక్స్రే స్కాన్ ఉపయోగించి కేవలం ఐదు సెకన్లలోనే కరోనావైరస్ను గుర్తించవచ్చని ఐఐటీ రూర్కీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కమల్ జైన్ అన్నారు. దాదాపు 40 రోజులు శ్రమించి ఈ సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు తెలిపారు.

వైద్య సిబ్బందికి ప్రమాదం తక్కువ..
అంతేగాక, సాఫ్ట్వేర్పై మేథపర హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న కమల్ జైన్ ఐసీఎంఆర్ను సమీక్ష కోసం సంప్రదించారు. ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించడం వల్ల పరీక్షల ఖర్చు తగ్గడమే కాకుండా వైద్య సిబ్బందికీ ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఏ వైద్య సంస్థ కూడా దీన్ని తనిఖీ చేయలేదు.

ఇలా విశ్లేషణ..
మొదట 60 వేలకు పైగా ఎక్స్రే స్కాన్లను విశ్లేషించినట్లు తెలిపిన జైన్.. ఇందులో కరోనా, న్యూమోనియా, క్షయ రోగులవి తీసుకున్నట్లు తెలిపారు. మూడు వ్యాధుల వల్ల ఒక్కొక్కరి ఊపరితిత్తుల్లో శ్లేష్మం(ద్రవం) తీవ్రత, తేడాలను విశ్లేషించి కృత్రిమ మేధ ఆధారిత డేటాబేస్ను రూపొందించినట్లు తెలిపారు. అమెరికాలో ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఎక్స్రే డేటాబేస్నూ విశ్లేషించినట్లు జైన్ తెలిపారు.

పక్కాగా గుర్తించేందుకు..
ఈ సాఫ్ట్వేర్తో ప్రాథమిక పరీక్ష చేసి పక్కాగా గుర్తించేందుకు క్లినకల్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. బ్యాక్టీరియా కారక ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తుల్లో కొద్ది భాగంలోనే ఉండగా కరోనా ప్రభావం మరెంతో తీవ్రంగా ఉంటుంది. బైలాటెరల్ ఒపాసిటీ, ఊపిరితిత్తుల్లోని ద్రవం, ఏమైనా గడ్డకట్టాయా? వంటి విషయాలు దీని ద్వారా తెలుసుకోవచ్చని జైన్ వివరించారు. అమెరికాలోని అమెజాన్ విశ్వవిద్యాలయం కూడా ఇలాంటి ప్రయోగమే చేసిందని, అయితే, విజయవంతం అవ్వలేదని కమల్ జైన్ తెలిపారు.
Recommended Video

పెరుగుతున్న కేసులు, మరణాలు
ఇక భారతదేశంలో 23,642 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 17,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5241 మంది కోలుకోగా, 742 మంది మరణించారు. కాగా, ఢిల్లీ ఐఐటీ కూడా కరోనా పరీక్షల కోసం కొత్త విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. తక్కువ ఖర్చులో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన వినూత్న విధానానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. అంతేగాక, ఇది 'రియల్ టైమ్ పీసీఆర్ బేస్డ్ డయాగ్నోస్టిక్ ఆసే' విధానం అని పేర్కొంది. కాగా, ఈ ప్రక్రియకు ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన తొలి విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీనే కావడం గమనార్హం. ఫలితాల్లో భారీ వైరుధ్యం వస్తున్న కారణంగా చైనా తయారీ కిట్ల ద్వారా పరీక్షల నిర్వహణను ఐసీఎంఆర్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
తాము రూపొందించిన విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం ఖచ్చితత్వం వచ్చిందని ఐఐటీ వెల్లడించింది. మానవుల్లో ఉండే ఇతర కరోనావైరస్లలో లేని కొన్ని ప్రత్యేకతలను కరోనా కారక వైరస్లోని ఆర్ఎన్ఏలో గుర్తించినట్లు స్పష్టం చేసింది. వీటిని లక్ష్యంగా చేసుకుని రోగ నిర్ధారణ చేసే విధానాన్ని తాము అభివృద్ధి చేస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications