లేడీ టీచర్ హత్య: సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు ఇళయరాజా !
అక్రమ సంబంధం కారణంగా చెన్నైలో మహిళా టీచర్ నివేదాను కారు ఎక్కించి హత్య చేసి చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు వెళ్లిన ఆమె ప్రియుడు ఇళయరాజా బుధవారం జైలు ఆవరణంలోని బాత్ రూంలో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేస
చెన్నై: వివాహేతర సంబంధం కారణంగా కారు ఎక్కించి మహిళా టీచర్ నివేదాను హత్య చేసిన ఆమె ప్రియుడు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా టీచర్ నివేదాను హత్య చేసిన ఆమె ప్రియుడు ఇళయరాజ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
పొల్లాచ్చికి చెందిన మహిళా టీచర్ వివేదా, ఆమె పక్కింటిలోనే నివాసం ఉంటున్న అగ్నిమాపక శాఖ ఉద్యోగి ఇళయరాజాకు అక్రమ సంబంధం ఉంది. అయితే ఫేస్ బుక్ లో పరిచయం అయిన ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి గణపతితో నివేదా అక్రమ సంబంధం సాగించిందని సమాచారం.
సమయం కోసం వేచి చూశాడు
నివేదా, గణపతిల విషయం జీర్ణించుకోలేని ఇళయరాజా సమయం కోసం వేచిచూశాడు. గత ఆదివారం చెన్నైలోని న్యూ అవడి రోడ్డు వేలంగాడు స్మశానవాటిక సమీపంలో నివేదా, గణపతి నిలబడి మాట్లాడుతున్న సమయంలో ఇళయరాజా కారు వేగంగా వారి మీదకు నడిపాడు.
ఏడేళ్ల నుంచి నాతో ఉంటూ !
కారు దూసుకుపోవడంతో నివేదా మరణించింది. గణపతి ప్రాణాలతో తప్పించుకున్నాడు. నివేదా హత్య కేసులో పోలీసులు ఇళయరాజాను అరెస్టు చేశారు. తనతో ఏడేళ్ల నుంచి అక్రమ సంబంధం సాగించిన నివేదా ఇప్పుడు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం జీర్ణించుకోలేక హత్య చేశానని ఇళయరాజా పోలీసుల ముందు అంగీకరించాడు.
సెంట్రల్ జైలుకు ఇళయరాజా
నివేదాతో పాటు గణపతిని కూడా హత్య చెయ్యాలని ప్లాన్ చేశానని ఇళయరాజా అన్నానగర్ పోలీసుల ముందు అంగీకరించాడు. పోలీసులు ఇళయరాజాను అరెస్టు చేసి చెన్నై నగర శివార్లలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
నివేదా కుమార్తె
చెన్నై శివార్లలోని మరుమలై నగర్ లో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్న నివేదా కుమార్తెను పోలీసులు విచారించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ జైల్లో ఉన్న ఇళయరాజాను మరో సారి విచారించాలని సిద్దం అయ్యారు.
బ్యారక్ నుంచి బయటకు వచ్చి
బుధవారం ఉదయం ఇళయరాజా బ్యారెక్ నుంచి బయటకు వచ్చాడు. జైలు ఆవరణంలోని బాత్ రూంలోకి వెళ్లిన ఇళయరాజా లుంగీతో ఉరి వేసుకున్నాడు. ఇళయరాజా ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో జైలు సిబ్బంది వెళ్లి చూడగా ఇళయరాజా ఉరి వేసుకున్న విషయం వెలుగు చూసింది.
బాత్ రూంలోనే ఔట్
జైలు ఆవరణంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇళయరాజా మరణించాడని వైద్యులు నిర్దారించారు. ఇళయరాజా మృతదేహాన్ని రాయపేట్ ఆసుపత్రికి తరలించారు. ఇళయరాజా లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు మీడియాకు చెప్పారు.
టెక్కీ స్వాతి, నివేదా హంతకులు ఇదే జైల్లో
మహిళా టెక్కీ స్వాతి హత్య కేసులో అరెస్టు అయిన రాంకుమార్ సైతం పుళల్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పు అనే వ్యక్తి ఇదే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మహిళా టీచర్ హత్య కేసులో జైలుకు వెళ్లిన రెండు రోజులకే అగ్నిమాపక శాఖ ఉద్యోగి ఇళయరాజా ఆత్మహత్య చేసుకోవడంతో జైలు సిబ్బంది హడలిపోతున్నారు.