అబార్షన్ రాకెట్: డ్రైనేజీలో 19గర్భస్థ పిండాలు, వైద్యుడి అరెస్ట్
మహారాష్ట్రలో సంచలనంగా మారిన అక్రమ అబార్షన్ రాకెట్ గుట్టురట్టయింది. అక్రమ అబార్షన్లు నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ ఖిద్రపురేను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని బెల్గామ్లో అతన్ని అదుపులోక
బెల్గామ్: మహారాష్ట్రలో సంచలనంగా మారిన అక్రమ అబార్షన్ రాకెట్ గుట్టురట్టయింది. అక్రమ అబార్షన్లు నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ ఖిద్రపురేను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని బెల్గామ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఓ మురికి కాలువలో సుమారు 19 ఆడ గర్భస్థ పిండాలను పోలీసులు గుర్తించారు. మైసాల్ గ్రామంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కేంద్రంగా ఈ దందా సాగినట్లు తెలిసింది. ఇటీవల ఓ అక్రమ అబార్షన్ వికటించడంతో ఓ మహిళ మృతిచెందింది.
ఆ కేసును చేధిస్తున్న పోలీసులకు ఈ భయంకరమైన గుట్టు చిక్కింది. క్లినిక్కు కొద్ది దూరంలో పిండాలు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భారతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ బాబాసాహెబ్ ఖిద్రపురే కోసం పోలీసులు గాలించారు.
చివరకు అతన్ని కర్ణాటకలో అరెస్టు చేశారు. హోమియోపతిలో డాక్టర్ ఖిద్రికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లు సంగ్లి జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, దాదాపు పదేళ్ల నుంచి ఆ డాక్టర్ క్లినిక్ నడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు.