కేంద్రమంత్రి కూతురికి గోవాలో ఇల్లీగల్ బార్ బిజినెస్: కాంగ్రెస్కు హైకోర్టు సమన్లు: తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి చెందినట్టుగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తోన్న అక్రమ బార్ వ్యాపార వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన కుమార్తెపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడతానని హెచ్చరించిన స్మృతీ ఇరానీ.. అన్నంత పనీ చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. జైరామ్ రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలకు కొద్దిసేపటి కిందటే సమన్లను జారీ చేసింది.
కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, పవన్ ఖేరా, మహిళా కాంగ్రెస్ ప్రతినిధి నెట్టా డిసౌజా ఇదివరకు స్మృతి ఇరానీ కుటుంబం పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరానీ కూతురు గోవాలో దొంగ లైసెన్స్తో రెస్టారంట్, బార్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది మే లో మరణించిన వ్యక్తి పేరు మీద ఆ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఉందని, అతను మరణించిన సంవత్సరం తర్వాత అంటే 2021 జూన్లో ఆయన పేరుపై లైసెన్స్ తీసుకున్నారని విమర్శించారు. మరణించిన వ్యక్తి పేరు మీద లైసెన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఆ రెస్టారంట్కు రెండు లైసెన్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గోవా చట్టం ప్రకారం బార్ అండ్ రెస్టారంట్ నిర్వహణ కోసం ఒక లైసెన్స్ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని, అదే సమయంలో ఈ బార్కు రెస్టారంట్ నిర్వహించే లైసెన్స్ లేదు పేర్కొన్నారు. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. తన కుమార్తె, కుటుంబం మీద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలకూ నోటీసులను కూడా పంపించారు.
ఇవ్వాళ తాజాగా ఢిల్లీ హైకోర్టు జైరామ్ రమేష్, పవన్ ఖేరా నెట్టా డిసౌజాలకు సమన్లు జారీ చేసింది. జోయిష్ డిసౌజాపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ట్విట్టర్ పోస్టలను తొలగించాలని ఆదేశించింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వాటిని డిలెట్ చేయాలని పేర్కొంది. దీనిపై జైరామ రమేష్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసిన విషయాన్ని ధృవీకరించారు. తాము చేసినవి ఆరోపణలు కావని, నిజాలేనని అన్నారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని, ఛాలెంజ్ చేస్తామని స్పష్టం చేశారు.