ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర: విచారణలో ఐఎం టెక్కీ వెల్లడి
న్యూఢిల్లీ: రాబోయే పండగల సీజన్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో దాడులతో విధ్వంసం సృష్టించాలని ఇండియన్ ముజాహిదీన్ పథకాలు వేసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు ఇటీవల ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో అరెస్టు చేసినా సంస్థ మిలిటెంటు టెక్కీ అజాజ్ షేక్ ఇంటరాగేషన్లో వెల్లడించాడు.
ఇండియన్ ముజాహిదీన్కు కీలక సంధానకర్త, హవాలా మార్గంలో నిధులను తరలించడంలో నిష్ణాతుడైన 27 ఏళ్ల అజాజ్ షేక్ గత ఏడాది యాసీన్ భత్కల్ను అరెస్టు చేసిన వెంటనే నేపాల్కు పారిపోయి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అయితే ఢిల్లీ చేరుకోవాలంటూ అతడ్ని పాకిస్తాన్లోని మిలిటెంట్లు రియాజ్ భత్కల్, మొహిసిన్ చౌదరిలు ఆదేశించారు.

పోలీసులు గుర్తు పట్టకుండా ఉండడం కోసం బ్రేక్ జర్నీలు చేయాలని, నేరుగా ఢిల్లీ వెళ్లవద్దని కూడా వారు అతడికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. లక్నో, మొరాదాబాద్, సహరాన్పూర్ మీదుగా ఢిల్లీ చేరుకోవాలని అతడ్ని ఆదేశించారని, ఢిల్లీ చేరుకున్న తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని వారు చెప్పారని అతను చెప్పాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
హవాలా ద్వారా సొమ్ము తరలించడంలో అజాజ్ షేక్ పేరొందడంతో.. ఇందుకోసమే ఆయనను ఆయా ప్రాంతాల గుండా వెళ్లాల్సిందిగా సూచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో పేలుళ్లు సృష్టించేందుకే ఈ సొమ్ము వినియోగించనున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications