18 ఏళ్లు నిండినవారందరికీ టీకా ఇవ్వండి: ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న క్రమంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోడీని కోరింది. ఈ మేరకు మంగళవారం ఓ లేఖ రాసింది. టీకాలు కరోనా తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నామని, రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందించాలన్నారు. దగ్గర్లోని టీకా కేంద్రాల్లో ఉచితంగా టీకా అందించడంతోపాటు ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చిన వారికి టీకా పంపిణీ చేయాలని లేఖలో ఐఎంఏ కోరింది.
అంతేగాక, బహిరంగ ప్రదేశాల్లో సంచరించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరుకులు తీసుకునే వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా చేయాలని తెలిపింది. కరోనా టీకా పంపిణీ వ్యక్తిగత రోగ నిరోధక శక్తిని పెంచి, కేసుల సంఖ్యను పరిమితం చేస్తుందన్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించి, హెర్డ్ ఇమ్యూనిటీని పెంచేందుకు టీకా ఒకటే మార్గం అని పేర్కొంది.
కరోనా టీకా అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ఐఎంఏ ప్రధానికి లేఖ పేర్కొన్నారు. కరోనావైరస్ చైన్ను బ్రేక్ చేసేందుకు పరిమితం కాలం నిరంతర లాక్ డౌన్ ను విధించాలని కోరింది. దేశంలో గత కొద్ది రోజులుగా లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆందోళన చెందిన ఐఎంఏ.. ప్రధానికి ఈ మేరకు లేఖ రాసింది.
కాగా, గత 24 గంటల్లో భారత్లో 96,982 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 50,143 కరోనా బారిన పడిన వారు కోలుకోగా , గడచిన ఒక రోజులో 446 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులను చూస్తే 1,26,86,049, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీలు 1,17,32,279 కాగా , ప్రస్తుతం దేశంలో ఉన్న క్రియాశీల కేసులు 7,88,223 గా ఉంది.