IMD Report: ఈసారి మే నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం... 121 ఏళ్లలో ఇదే రెండో అత్యధికం...
సాధారణంగా మే నెలలో ఎండలు దంచి కొడుతాయి. కానీ ఈసారి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలేమీ నమోదవలేదు. పైగా అధిక వర్షపాతం నమోదైంది. గత 121 ఏళ్లలో ఇదే రెండో అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ వెల్లడించింది. వరుస తుఫాన్ల కారణంగానే ఈసారి మే నెలలో ఇంత భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
Recommended Video
దేశంలో ఈ ఏడాది మే నెలలో నమోదైన అత్యధిక సగటు ఉష్ణోగ్రత 34.18 డిగ్రీల సెల్సియస్గా పేర్కొంది. ఇది 1901 నుంచి ఇప్పటివరకూ నమోదైన నాలుగో అత్యల్ప ఉష్ణోగ్రతగా తెలిపింది. దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత 32.68 డిగ్రీల సెల్సియస్ 1917లో నమోదైంది.
ఈసారి దేశవ్యాప్తంగా మే నెలలో 107.9 మి.మీ వర్షపాతం నమోదైంది. సుదీర్ఘ కాల సగటు (ఎల్పీఏ) 62 మి.మీ. కంటే ఇది 74 శాతం అధికం. దేశంలో 1990లో అత్యధికంగా 110.7మి.మీ వర్షపాతం నమోదైంది. ఈసారి దేశవ్యాప్తంగా ఎక్కడా ఎండల ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ఈసారి మే నెలలో అరేబియా సముద్రం,బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో ఏర్పడితన తౌక్టే తుఫాన్ తీవ్ర రూపం దాల్చి మే 17న గుజరాత్ తీరాన్ని తాకింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ తీవ్రరూపం దాల్చి మే 26న ఒడిశా వద్ద తీరాన్ని తాకింది. యాస్ తుఫాన్ ప్రభావం ఒడిశా,బెంగాల్ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ల ప్రభావంతో తూర్పు,పశ్చిమ రాష్ట్రాలే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి.
ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ఆగమనంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ముంబైని వర్షం ముంచెత్తింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,గుజరాత్,ఒడిశా సహా పలు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ,కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శని,ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.