గౌరీ లంకేష్ హత్య, హిందూ దేవుళ్లపై విమర్శలు, వారం ఆలస్యం అయితే ఆయన ఫినిష్!
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్యతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ యువసేన నాయకుడు కేటీ. నవీన్ కుమార్ అలియాస్ హోట్టే మంజు మీద మరో కేసు నమోదు చెయ్యడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) అధికారులు సిద్దం అయ్యారు. వివాదిత కన్నడ రచయిత, హిందూ దేవుళ్లను పదేపదే విమర్శించే రిటైడ్ అధ్యాపకుడు కేఎస్. భగవాన్ ను హత్య చెయ్యాలని కుట్రపన్నారని ఎస్ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక్కవారం ఆలస్యం అయ్యి ఉంటే కేఎస్. భగవాన్ ను నిజంగానే హత్య చేసేవాళ్లని ఎస్ఐటీ అధికారులు అంటున్నారు.
గౌరీ లంకేష్ ఇల్లు
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీనగరలోని గౌరీ లంకేష్ ఇంటి ముందు నవీన్ కుమార్ అనేక సార్లు సంచరించాడని, ఆమె కార్యాలయం నుంచి ఎప్పుడు ఇంటికి వస్తారు, వెంట ఎవరెవరు ఉంటారు అనే పూర్తి వివరాలు సేకరించి హంతకులకు సమాచారం ఇచ్చాడని ఎస్ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు.
2017 సెప్టెంబర్ 5
2017 సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో గౌరీ లంకేష్ లంకేష్ పత్రిక కార్యాయం నుంచి కారులో రాజరాజేశ్వరినగరలోని ఇంటికి వెళ్లారు. కారు నిలిపి గేట్ తీస్తున్న సమయంలో బైక్ లో వెళ్లిన హంతకులు పిస్తోల్ తో కాల్చి గౌరీ లంకేష్ ను దారుణంగా హత్య చేసి పారిపోయారు.
కోర్టులో నవీన్ రివర్స్ గేర్
నవీన్ కుమార్ విచారణలో గౌరీ లంకేష్ హత్యకు సహకరించానని అంగీకరించాడని ఎస్ఐటీ అధికారులు అంటున్నారు. అయితే న్యాయమూర్తి ముందు గౌరీ లంకేష్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని హిందూ యువసేన నాయకుడు నవీన్ కుమార్ మాటమార్చాడని ఎస్ఐటీ అధికారులు అన్నారు.
నార్కో పరీక్షలు
గంటగంటకు నవీన్ కుమార్ మాటమార్చుతున్నాడని, విచారణకు సహకరించడం లేదని, అతనికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎస్ఐటీ అధికారులు కోర్టులో మనవి చేశారు. నవీన్ కుమార్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
కేఎస్ భగవాన్ టార్గెట్
ఒక్క వారంలోపు మైసూరులో నివాసం ఉంటున్న కేఎస్. భగవాన్ ను హత్య చెయ్యాలని నవీన్ కుమార్, తదితరులు పక్కా స్కెచ్ వేశారని ఎస్ఐటీ అధికారులు అంటున్నారు. హిందూ దేవుళ్లను పదేపదే విమర్శించే కేఎస్. భగవాన్ ను చంపేస్తామని గతంలో గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో ఇప్పటికే పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.
హత్యకు కుట్ర!
వివాదాస్పద రచయిత కేఎస్. భగవాన్ హత్యకు కుట్ర జరిగిందని వెలుగు చూడటంతో ఆయనకు మరింత భద్రత పెంచామని మైసూరు నగర పోలీసు కమిషనర్ సుబ్రమణ్యేశ్వర మీడియాకు చెప్పారు. గౌరీ లంకేష్ హత్య తరువాత కేఎస్. భగవాన్ హత్యకు కుట్ర జరుగిందని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చాలాసార్లు మీడియాకు చెప్పారు.
ఒకే రకం పిస్తోల్
గౌరీ లంకేష్ ను 7.65 ఎంఎం పిస్తోల్ తో హత్య చేశారు. 2015లో ఆగస్టులో దారవాడలో ప్రోఫసర్ ఎంఎం. కలబుర్గిని అదే రకం పిస్తోల్ తో ఆయన ఇంటిలోనే హత్య చేశారు. గోవింద్ పన్సారేని అదే రకం పిస్తోల్ తో హత్య చేశారు. ఇప్పుడు నవీన్ కుమార్ దగ్గర అదే రకం పిస్తోల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఎస్ఐటీ అధికారులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.