లోక్సభ ఎన్నికలు 2019: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్..ప్రియాంకా పేరు మిస్సింగ్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల రణక్షేత్రానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు తమ రేసుగుర్రాల కోసం వేట ప్రారంభించాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకంటే కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన తొలిజాబితాను ప్రకటించింది.
రాయ్బరేలీ నుంచి సోనియా... అమేథీ నుంచి రాహుల్
2019 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అప్పుడే అభ్యర్థులను ప్రకటించింది. తమ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది హస్తం పార్టీ. తొలి జాబితాలో విడుదల చేసిన అభ్యర్థులో యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్బరేలీ నుంచి బరిలో దిగనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీలో నిలుస్తారు. ఇక గుజరాత్లో నాలుగు లోక్సభ స్థానాలకు, ఉత్తర్ప్రదేశ్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.
ఇప్పటికే ఎస్పీ-బీఎస్పీ పొత్తు... కాంగ్రెస్పై ఆలోచన
ఇదిలా ఉంటే ఇప్పటికే యూపీలో ఎస్పీ బీఎస్పీలు పొత్తుతో వెళుతున్నాయి. ఆ రెండు పార్టీలు అమేథీ, రాయ్బరేలీలలో తమ అభ్యర్థులను బరిలోకి దింపకూడదనే నిర్ణయానికి వచ్చాయి. అయితే అఖిలేష్ మాత్రం కాంగ్రెస్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే సంకేతాలను ఇచ్చారు. ఇదిలా ఉంటే అఖిలేష్తో ఇంకా చర్చలు జరుగుతున్నాయని చర్చలు ఓ కొలిక్కి వస్తాయని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
ఆ దేశంలో కాంగ్రెస్కు మంచి టీఆర్పీలు: జైట్లీ
యూపీ గుజరాత్లో అభ్యర్థులు వీరే
ఇక గురువారం విడుదల చేసిన జాబితాలో ఉత్తర్ప్రదేశ్లోని ఫరుక్కాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బరిలో నిలవనుండగా... ఖుషీ నగర్ నుంచి ఆర్పీఎన్ సింగ్ పోటీలో ఉండనున్నారు. ఇక సహరన్పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, బదౌన్ నుంచి సలీమ్ ఇక్బాల్ శర్వాణి, దౌర్హారా నుంచి జితిన్ ప్రసాద్, ఉన్నావ్ నుంచి అనుటాండన్, అక్బర్పూర్ నుంచి రాజారాం పాల్, జలౌన్ నుంచి బ్రిజ్ లాల్ ఖాబ్రి, ఫైజాబాద్ నుంచి నిర్మల్ ఖత్రిలు బరిలో నిలువనున్నారు.
ఇక గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు వెస్ట్ నుంచి రాజు పర్మార్, ఆనంద్ నుంచి గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఛీఫ్ భరత్సిన్హ సోలంకి, వడోదర నుంచి ప్రశాంత్ పటేల్, చోటా ఉదయ్ పూర్ నుంచి రబ్జిత్ మోహన్సిన్హ్ రథ్వాలు పోటీ చేయనున్నారు.