అవసరమైతే చిన్నపార్టీలతో కలుస్తాం ఎన్నికల అనంతర పొత్తులపై మోడీ క్లారిటీ
ఢిల్లీ : కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి పొత్తులపై మాట్లాడారు. న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల అనంతర పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏ పక్షాలు మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. అవసరమనుకుంటే ఎన్డీయేతర, సింగిల్ సీట్లు వచ్చిన పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. తొలి విడత ఎన్నికలకు రెండు రోజుల ముందు మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశ విభజనకు కాంగ్రెస్ కారణం! నేతల అవివేకం వల్లే పాకిస్థాన్ ఏర్పడిందన్న మోడీ
చిన్న పార్టీలతో పొత్తుకు సిద్ధం
న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారం చేపడతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు కోసం ఒకవేళ అవసరమైతే ఎన్డీయేతర పక్షాలు, ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. సింగిల్ సీటు సాధించిన రాజకీయపార్టీలతో పొత్తుకు సైతం వెనకాడమని మోడీ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్, వైసీపీలతో పొత్తుపై
ఎన్నికల అనంతరం వైసీపీ చీఫ్ జగన్, గులాబీ బాస్ కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటారా అన్న నెట్వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ రాహుల్ జోషి అడిగిన ప్రశ్నకు మోడీ సమాధానం దాటవేశారు. బీజేపీకి ఈసారి 2014లో వచ్చిన దానికన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి సాయం తీసుకోవాల్సిన అవసరం తమకు రాదని తేల్చి చెప్పారు. అయితే దేశ సమగ్ర అభివృద్ధి కోసం తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమని మోడీ స్పష్టంచేశారు.
దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు మాత్రమే బీజేపీ ధ్యేయం కాదన్న మోడీ... దేశాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమన్న ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రయత్నంలో ఒక్క ఎంపీ ఉన్న పార్టీ తమతో కలిసి నడిచేందుకు సిద్ధమైనా వారిని కలుపుకు పోతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోమని కుండబద్దలు కొట్టారు.
మెజార్టీపై మోడీకి అనుమానం
న్యూస్ 18 ఇంటర్వ్యూలో మోడీ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు మేజిక్ ఫిగర్ను అందుకోలేవని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఈ భయంతోనే మోడీ చిన్నాచితకా పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ రాదన్న భయంతోనే మోడీ.. తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అనామక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.