అప్పుడు గోవా, మణిపూర్లలో బీజేపీ ఏం చేసిందో? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్!
బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాయి. మంగళవారం మధ్నాహ్నం వరకు వెలువడిన ఫలితాలు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టెలే కనిపించాయి. అయితే, సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి.
అయితే, కర్ణాటక ఎన్నికల్లో 104సీట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 78సీట్లు వచ్చాయి. దీంతో, 38సీట్లు సాధించిన జేడీఎస్ కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జేడీఎస్ అధినేతలైన హెచ్డీ దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. అంతేగాక, కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసేందుకు కూడా అంగీకరించారు. దీంతో జేడీఎస్ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్ వద్దకు వెళ్లాయి. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉండగా, జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం కాంగ్రెస్ పార్టీకి సరికాదంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప దుయ్యబట్టారు.
అయితే, ఇంతకుముందు గోవా, మణిపూర్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలను కలుపుకుని బీజేపీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీజేపీకి గుర్తు చేస్తున్నారు.
మణిపూర్లో మొత్తం 60సీట్లలో కాంగ్రెస్ 28(35.1శాతం ఓటింగ్ శాతం), బీజేపీ 21(36.2ఓటింగ్ శాతం)సీట్లు దక్కించుకున్నాయి. గోవాలో కూడా మొత్తం 40 స్థానాల్లో బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ కూడా ఇతర పార్టీలతో కలిసి బీజేపీ అధికారం చేపట్టింది.