పన్నీర్ సెల్వం కుమారుడు, సోదరుడిని అరెస్టు చెయ్యోద్దు: హైకోర్టు!
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఘర్షణకు సంబంధించిన కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన తమ్ముడు ఓ. రాజాను అరెస్టు చెయ్యరాదని మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 13వ తేది లోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని ఆర్ కే నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ కు సూచిస్తూ వచ్చే గురువారానికి పిటిషన్ విచారణ వాయిదా వేస్తున్నామని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఓకే చోట ప్రచారం చెయ్యడంతో
అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) వర్గం నుంచి పోటీ చేస్తున్న మధుసూదనన్ కు మద్దతుగా ఈనెల 6వ తేదిన ఆర్ కే నగర్ లోని తండయార్ పేట, నేతాజీ నగర్ ప్రాంతంలో పన్నీర్ సెల్వం, ఆయన వర్గీయులు ప్రచారం చేశారు.
దుమ్ములేచిపోయింది
పన్నీర్ సెల్వం ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన వర్గీయులు, సమీపంలో ప్రచారం చేస్తున్న టీటీవీ దినకరన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పన్నీర్ సెల్వం, దినకరన్ వర్గాలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆరు సెక్షలతో
పన్నీర్ సెల్వం వర్గీయుల మీద శరవణన్ అనే వ్యక్తి ఫిర్యాదు చెయ్యడంతో ఆర్ కే నగర్ పోలీసులు ఆరు సెక్షల కింద పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన సొదరుడు ఓ. రాజాతో సహ పలువురి మీద కేసు నమోదు చేశారు.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు
ఉప ఎన్నికల ఘర్షణ కేసులో ఏ సమయంలోనైనా అరెస్టు కావచ్చని సమాచారం తెలుసుకున్న రవీంద్రనాథ్ కుమార్, రాజా మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పన్నీర్ సెల్వంకు ప్రజల్లో రోజురోజుకు పలుకుబడి పెరుగుతోందని, దాన్ని విచ్చిన్నం చెయ్యడానికి రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి తమపై అబద్దపు కేసు నమోదు చేశారని వీరు కోర్టుకు మనవి చేశారు.
అరెస్టు చెయ్యరాదని
సోమవారం పన్నీర్ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్. భాస్కరన్ విచారించారు. పిటిషనర్ న్యాయవాది వెంకటేష్ బెయిల్ విచారణ సోమవారం జరగాలని పట్టుబట్టారు. అయితే న్యాయమూర్తి మంగళవారం పిటిషన్ ను విచారిస్తామని చెప్పారు. మంగళవారం న్యాయమూర్తి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన సోదరుడు రాజాను అరెస్టు చెయ్యరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ గురువారానికి విచారణ వాయిదా వేశారు.