పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేం: నిర్మలా సీతారామన్, కరోనా మందులకు మినహాయింపు
లక్నో: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశం మరోసారి వాయిదా పడింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లక్నోలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ మీడియా సమాశంలో వెల్లడించారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్నే అజెండాలో చేర్చి చర్చించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.
దేశంలో వ్యాప్తి కొనసాగుతున్న కరోనావైరస్ సంబంధిత ఔషధాలపై తగ్గింపు డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉందన్నారు. అలాగే క్యాన్సర్ సంబంధ ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని కూడా 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
సరుకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతేగాక, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపై కేంద్రమంత్రి స్పందించారు. వినియోగదారులపై ఎలాంటి పన్నూ వేయడం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అదే సమయంలో గతంలో సంబంధిత రెస్టారెంట్ జీఎస్టీ చెల్లించలేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లించాలని సీతారామన్ తెలిపారు. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలపై జీఎస్టీ విధించినప్పటికీ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం లేదని చెబున్నారు.