యోగీ ఆదిత్యానాథ్కు పెద్ద దెబ్బ: మాయ, అఖిలేష్ పొత్తు హిట్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని రెండు లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి పెద్ద దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్కు వ్యక్తిగతంగా ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఎస్పీ, బిఎస్పీ స్నేహానికి ఓట్లు పడ్డాయి. ఫలితాలు పూర్తిగా వెలువడకపోయినప్పటికీ గోరఖ్పూర్, పుల్పూరు స్థానాల్లో ఎస్పీ విజయం ఖాయమైంది.
ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్కు గోరఖ్పూర్ పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. ఎస్పీ అభ్ర్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ బిజెపి అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ స్థితిలో గోరఖ్పూర్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. మీడియా ప్రతినిధులను ఓట్ల లేక్కింపు కేంద్రాలనుంచి బయటకు పంపించివేశారు.

బిఎస్పీ, ఎస్పీ పొత్తుకు మద్దతు
గోరఖ్పూర్, పుల్పూర్ లోకసభ స్థానాల్లో ఎస్పీ, బిఎస్పీ పొత్తుకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అధికారికంగా ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ ఎస్పీకి మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ మద్దతు ఇచ్చింది. దీంతో ఎస్పీ అభ్యర్థులు విజయం దిశగా సాగారు.

భవిష్యత్తులో సైతం...
ఉత్తరప్రదేశ్లో బిజెపిని ఎదుర్కోవడానికి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో బిఎస్పీ జత కట్టే అవకాశం లేకపోలేదు. కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేసింది. కానీ దాన్ని ప్రజలు ఆదరించలేదు. ఈ స్థితిలో రాహుల్ గాంధీ వచ్చే లోకసభ సాధారణ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో కలిసి నడవక తప్పని అనివార్య రాజకీయ పరిస్థితి చోటు చేసుకుంది.

హోరెత్తిన ఆ నినాదం
గోరఖ్పూర్, పుల్పూర్ లోకసభ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థుల విజయం కావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి. బువా - బతీజా జిందాబాద్ నినాదం హోరెత్తింది. లక్నోలోని ఎస్పీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆ నినాదం ఇస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు పరస్పరం రంగులు పూసుకున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో బిఎస్పీకి మద్దతు
అవగాహనలో భాగంగా రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ బిఎస్పీకి మద్దతు ఇస్తోంది. తాము ఎస్పీ నేతలతో మాట్లాడామని, లోకసభ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పామని, దానికి బదులు తమకు రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ మద్దతు ఇవ్వాలని చెప్పామని బిఎస్పీ అధినేత మాయావతి ఉప ఎన్నికలకు ముందు చెప్పారు.












Click it and Unblock the Notifications