భారీ వర్షాలకు చెన్నై విలవిల: 10 మంది మృతి, 1,000 మంది సిబ్బంది, మరో రెండు రోజులు !
Recommended Video
చెన్నై: తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో చెన్నై నగరం, శివార్ల వాసుల్లో గుండె దడ పెరిగింది. సోమవారం నుంచి బుధవారం వేకువ జామున వరకు కుండపోతగా కురిసిన వర్షం ప్రజల్ని వణికించింది. రెండు రోజుల్లో లోతట్టు ప్రాంతాల్ని వరద నీళ్లు చుట్టుముట్టాయి.
కూపర, అడయార్ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. చెన్నై నగరం, శివారు ప్రాంతాలు, రహదారులు చెరువులను తలపించే రీతిలో వర్షం నీటితో నిండిపోయాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఎక్కడ మరో గండం ఎదుర్కోవాల్సి ఉంటుందో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, నాగపట్టినం, కడళూరు జిల్లాలో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ బుధవారం ఉదయం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు అడుగుల నీరు
చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి దాదాపు నాలుగు అడుగుల వర్షం నీరు చేరిపోయింది. వర్షం నీటిని ఇళ్ల నుంచి బయటకు పంపించడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కరెంట్ కోత, జాగారం
చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా పలు చోట్లు చెట్లు, విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ లేకపోవడం, నాలుగు అడుగుల వర్షం నీరు ఇళ్లల్లో నిలిచిపోవడంతో ప్రజలు జాగారం చేశారు.
సీఎం పళనిసామి ఆదేశాలు
చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఎడప్పాడి పళనిసామి ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నం లేక ఆకలితో అల్లాడుతున్న పేద ప్రజలకు ఆహారం సరఫరా చెయ్యాలని సీఎం ఆదేశించారు.
వెయ్యి మంది సిబ్బంది
భారీ వర్షాలకు చెన్నై నగరం విలవిలలాడుతోంది. అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చెన్నై నగరంలో రహదారుల మీద నిలిచిపోయిన భారీ వర్షం నీటిని తొలగించడానికి వెయ్యి మందికి పైగా సిబ్బంది శక్తివంచనలేకుండా పని చేస్తున్నారు.
సెలవులు లేవు
సెలవుల్లో ఉన్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిని వెనక్కిరప్పించారు. చెన్నై నగర ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి జయకుమార్, ఎస్పీలు వేలుమణి, బెంజిమెన్ మనవి చేశారు. చెన్నై నగరంలో పలువురు మంత్రులు పర్యటిస్తున్నారు.
మండలానికి ఒక ఐఏఎస్
భారీ వర్షాలు పడుతున్న జిల్లాల్లో మండలానికి ఒక ఐఏఎస్ చొప్పున 15 మంది ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. పోలీసులు, రెవెన్యూ, కార్పొషన్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పలుప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు.
10 మంది మృత్యువాత
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 10 మంది మరణించారు. గోడకూలి ఇద్దరు, విద్యుత్ షాక్ తో ఇద్దరు, పిడుగు పడి ముగ్గురు, చెరువు గట్టు మీద నుంచి జారీ ఇద్దరు మరణించారు. చెన్నై నగరంలోని బకింగ్ హోం కాలువులో పడి శాంతమ్మ (68) మరణించారు.