ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం..
ఆదాయపన్ను సవరణ బిల్లు (ది టాక్సేషన్ లా.. సెకండ్ అమెండ్ మెంట్-2016) మూజువాణి ఓటు ద్వారా ఈరోజు లోక్ సభలో ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ : ఆదాయపన్ను సవరణ బిల్లు (ది టాక్సేషన్ లా.. సెకండ్ అమెండ్ మెంట్-2016) ఈరోజు లోక్ సభలో ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రసంగం తరువాత మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందినట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.
లోక్ సభలో విపక్ష సభ్యుల గందరగోళం నడుమనే బిల్లు పాసవడం గమనార్హం. బిల్లుపై ఓటింగ్ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టగా.. ప్రస్తుతానికి దీనిపై సమగ్ర చర్చ వీలుపడదని స్పీకర్ పేర్కొన్నారు. కాగా, ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది. బిల్లు పాసైన అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
ఇక విపక్ష సభ్యుల ఆందోళన నడుమ రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ సమాధానం చెప్పి తీరాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో.. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.