జాగ్రత్త! నగదు లావాదేవీ రూ.2 లక్షలు దాటితే, అంతే మొత్తం పెనాల్టీ, ఐటీ హెచ్చరిక
భారీ నగదు లావాదేవీలు జరిపే వారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: భారీ నగదు లావాదేవీలు జరిపే వారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
అంతేకాదు, ఈ విధమైన భారీ నగదు లావాదేవీల సమాచారం తెలిస్తే blackmoneyinfo@ incometax.gov.in ద్వారా తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది.
2017-18 కేంద్ర బడ్జెట్లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు.
దీనికి లోక్సభ తన ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 269ఎస్టిని చేర్చారు. దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం.
అంతేకాదు, ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం కూడా చట్ట విరుద్ధం. అయితే బ్యాంకులు, పోస్టాఫీసులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలు స్వీకరించే మొత్తాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.