షాక్:200 మందికి ఐటిశాఖ నోటీసులు, డిపాజిట్ల పరిశీలనకు ఎనలిస్టులు!
పెద్దనగదు నోట్ల రద్దు తర్వాత కోటి రూపాయాలు, ఆ పైగా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన 200 ఖాతాదారులకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు పంపింది.
న్యూఢిల్లీ:పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కోటిరూపాయాలకు పైగా బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసిన 200 మంది ఖాతాదారులకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.పెద్ద నగదు నోట్ల రద్దుకు ముందు, రద్దు తర్వాత ఆయా బ్యాంకుల ఖాతాల్లో ఉన్న నగదు వివరాలను కూడ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఎనలిస్టులను నియమించుకొని ఆదాయపు పన్నుశాఖ ఆయా ఖాతాలను పరిశీలించనుంది.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారి ఖాతాలపై నిఘా వేస్తామని ఆదాయపుపన్నుశాఖ హెచ్చరించింది.ఈ హెచ్చరికలను అమలు చేస్తోంది.
నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంలో భాగంగా పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించింది.
బ్యాంకుల నుండి కూడ పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేసిన వారి ఖాతాల సమాచారాన్ని ఇవ్వాలని కూడ ఆదేశించింది. ఈ సమాచారం ఇవ్వని బ్యాంకులపై చర్యలకు కూడ వెనుకాడబోమని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది.
200 మందికి నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్నుశాఖ
పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో రెండున్నర లక్షల కంటే ఎక్కువగా ఎవరు నగదును డిపాజిట్ చేశారనే విషయమై ఆదాయపు పన్నుశాఖ ఆరా తీసింది. నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 200 మంది ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో సుమారు కోటి రూపాయాలు, అంతకంటే ఎక్కువ డబ్బును జమ చేశారు. పెద్ద మొత్తంలో నగదును జమ చేసిన రెండు వందల ఖాతాదారులకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.
రెండవ విడత ఆపరేషన్ క్లీన్ మన్ కి శ్రీకారం చుట్టిన ఆదాయపు పన్నుశాఖ
ఆదాయపు పన్నుశాఖ నల్లదనం నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమాన్ని ఆదాయపు పన్నుశాఖ తొలి విడత కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే రెండో విడత ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదాయపుపన్నుశాఖ భావిస్తోంది.
బ్యాంకు ఖాతాలను పరిశీలించనున్న ఆదాయపు పన్నుశాఖ
గత ఏడాది నవంబర్ 8వ, తేదికి ముందు, 8వ, తేది తర్వాత ఆయా ఖాతాదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసిన మొత్తంపై ఆదాయపు పన్నుశాఖ క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఎనలిస్టులను ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను పరిశీలించనుంది.
లెక్క చూపని ఆదాయం రూ.5400 కోట్ల గుర్తింపు
పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత నుండి ఈ ఏడాది జనవరి వరకు దేశవ్యాప్తంగా సుమారు 5400 కోట్ల రూపాయాలు లెక్క చూపిన నగదు ఉన్నట్టుగా ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. రద్దు చేసిన నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకొనేందకు అక్రమార్కులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఆదాయపు పన్నుశాఖ వ్యూహత్మకంగానే వ్యవహరిస్తోంది.
అక్రమార్కులక్ చెక్ పెట్టేందుకు ఇలా..
పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత అక్రమార్కులు తప్పించుకొనేందుకు చేస్తున్న మార్గాలపై ఆధాయపుపన్ను కన్నేసింది.అయితే అక్రమార్కులు తమ వల నుండి తప్పించుకొనే వీలు లేకుండా ఆదాయపుపన్నుశాఖ జాగ్రత్తలు తీసుకొంటుంది.ఆదాయపు పన్నుశాఖ 1,100 చోట్ల ఈ ఏడాది జనవరి 1వ, తేది వరకు దాడులు నిర్వహించారు. 253 చోట్ల సోదాలు నిర్వహించి 289 కేసులను నమోదు చేశారు. ఈ ఘటనల్లో సుమారు రూ.562 కోట్ల నగదును ఆధాయపు పన్నుశాఖ స్వాధీనం చేసుకొంది.