టార్గెట్ ఈటీఏ: ఐటీ దాడులు, తమిళనాడుకు షాక్
ఈటీఏ గ్రూపు సంస్థలకు సంబంధించి దేశ వ్యాప్తంగా 82 చోట్ల, తమిళనాడులో 17 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఈ సంస్థ సీమ బొగ్గు, చెత్తపదార్థాలు.
చెన్నై: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల నుంచి బడాబాబులు తేరుకోక ముందే ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు మరో షాక్ ఇచ్చారు.
ఈటీఏ గ్రూపు సంస్థలకు సంబంధించి దేశ వ్యాప్తంగా 82 చోట్ల, తమిళనాడులో 17 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. చెన్నైలోని ఎగ్మూరులోని బుహారీ టవర్ లో ఈటీఏ గ్రూప్ కార్యాలయం ఉంది.
ఈ సంస్థ సీమ బొగ్గు, చెత్తపదార్థాలు, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు, వర్తక వ్యాపారాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఆరోగ్య భీమా కంపెనీ, మల్టీ ఫెక్స్ సినిమా థియేటర్లు, ఐనాక్స్ థియేటర్ నిర్వహిస్తున్నారు.
బుధవారం ఈటీఏ కంపెనీ యజమానులు ఇళ్లు, కార్యాలయాల్లో తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో 75 మంది ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ సంస్థకు సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై ప్రాంతాల్లో మొత్తం 82 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి.
1998లో చెన్నైలో భవన నిర్మాణ రంగ సంస్థగా ప్రారంభం అయిన ఈటీఏ సంస్థ తరువాత క్రమేణా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి తన వ్యాపారాన్ని విస్తరించారు. చెన్నై నగరంలో కొత్త సచివాలయం, ప్రస్తుతం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ బాధ్యతలను ఇదే సంస్థ చేపట్టింది.
ఈపీఆర్ రోడ్డులో పెద్ద సంఖ్యలో అపార్ట్ మెంట్ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దుబాయ్ లో పలు కంపెనీలతో కలిసి వ్యాపారం చేశారు. తరువాత అక్కడి వ్యాపారులతో విభేదాలు రావడంతో దుబాయ్ లో వ్యాపారాలకు ఇటీవల స్వస్తి చెప్పారు.
కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖతో కలిసి భీమా పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ కట్టడాలను నిర్మించారు. ఒక్కో కంపెనీ కింద కనీసం రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టారని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
ఈటీఏ సంస్థలకు చెందిన అనేక కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంత మొత్తంలో నగదు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు ? అనే విషయం అధికారులు చెప్పడం లేదు. తమిళనాడులో మరో సారి ఐటీ దాడులు జరగడంతో బడాబాబులు, తమిళనాడు ప్రభుత్వ పెద్దలు హడలిపోతున్నారు.