karnataka: KGF బాబుపై ఇన్ కంటాక్స్ దాడులు??
ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి అనగానే తన అమ్ములపొదిలోని ఆయుధాలను ప్రయోగించడం భారతీయ జనతాపార్టీ పెద్దలకు అలవాటు. వీరు చెప్పేదంతా శ్రీరంగనీతులేనని కాంగ్రెస్ పార్టీనేతలు మండిపడుతున్నారు. వచ్చే సంవత్సరం కర్ణాటకలోని కోలారు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేయాలనుకుంటున్న ఉమ్రా డెవలపర్స్ యజమాని KGF బాబు అలియాస్ యూసుఫ్ షరీఫ్ తోపాటు ఆయనకు సంబంధించినవారి ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడిచేశారు.
బెంగళూరు నగరంలోని వసంతనగరలోని KGF బాబు ఇల్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. 40 మంది అధికారులు మూడు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. KGFకు చెందిన షరీఫ్ 20 సంవత్సరాల కిందట పాత సామగ్రిని కొనుగోలు చేసి అమ్మకాలు చేసే వ్యాపారంలోకి అడుగు పెట్టారు. మొన్నటి విధాన పరిషత్తు ఎన్నికల్లో తన ఆస్తిని రూ.1745 కోట్లుగా చూపించడంతో అంతా షాక్ తిన్నారు. చూపించిన ఆస్తులకు, రిటర్న్ దాఖలుకు పొంతన లేకపోవడంతో ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగాయి.
KGF బాబుకు భారీస్థాయిలో స్థిరాస్తులు, వ్యాపారాలున్నాయి. అంతేకాదు 5 నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు.. ఒకటేమిటి అన్నింట్లోను పెట్టుబడులున్నాయి. అయితే KGF బాబు 2017 నుంచి వరుసగా నాలుగు సంవత్సరాలపాటు ఆదాయపు పన్నులో రూ.14.89, రూ.42.35, రూ.49.74, రూ.15.86 లక్షల ఆదాయం గడించానని చూపించారు. ఈ ఆదాయమే అధికారుల అనుమానాలకు కారణమైందంటున్నారు.