Independence day 2022: ఈ సమయంలోగా జాతీయ జెండాను ఎగురవేయాలి: కేంద్రం గైడ్లైన్స్
భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవంను ఏటా ఆగష్టు 15న దేశం యావత్తు జరుపుకుంటుంది. ఆ రోజు సెలవుదినం.ఈ రోజున దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసి కవాతులు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారత ప్రధానమంత్రి ఎర్రకోట పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రహోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది.
ఆగష్టు 15న జెండా ఎగురవేసే సమయం
కేంద్రహోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర రాజధానులు / జిల్లా ప్రధాన కార్యాలయం / సబ్ డివిజన్ / బ్లాక్ / గ్రామ పంచాయతీ / గ్రామాలు మొదలైన వాటిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు / జాతీయ జెండాను ఎగురవేయడం వంటివి ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభించాలి. వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ కేంద్రం పేర్కొంది.
ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏటా ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చాలా ఘనంగా ఉత్సాహంగా ప్రారంభం అవుతాయి. కేంద్రం జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఎర్రకోట వద్ద వేడుకల షెడ్యూల్ ఇలాగుంది.
* సాయుధ బలగాలు మరియు ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాన మంత్రి మోదీ గౌరవ వందనం స్వీకరిస్తారు
* ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంది. ఆ తర్వాత 21 తుపాకులతో గౌరవ వందనం చేయడం జరుగుతుంది
* భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపిస్తారు
* ప్రధాన మంత్రి ప్రసంగం ఉంటుంది. ఆ వెంటనే జాతీయ గీతం ఆలపిస్తారు. ఆ తర్వాత చివరిగా మూడు రంగుల బెలూన్లను గాల్లోకి వదులుతారు.
ఎట్ హోం ఫంక్షన్
ఇక స్వాతంత్ర్య దినోత్సవం రోజున సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్ర గవర్నర్లు లేదా లెఫ్ట్నెంట్ గవర్నర్లు ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్లో ఉన్నవారే కాకుండా పలు రంగాల్లో అశేష కృషి చేసిన వారికి సైతం ఆహ్వానం ఉంటుంది.
హర్ ఘర్ తిరంగా ప్రచారం
దేశ పౌరులు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటూ ఇప్పటికే కేంద్రం ఓ క్యాంపెయిన్ను ప్రారంభించింది.హర్ ఘర్ తిరంగా పేరుతో ఈ క్యాంపెయిన్ నడుస్తోంది.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో, హర్ ఘర్ తిరంగా ప్రచారం యొక్క లక్ష్యం ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని నింపడం మరియు దేశ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వారి సహకారాన్ని స్మరించుకోవడం. ఆగష్టు 13 నుంచి 15 వరకు దేశ పౌరులందరూ త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లపై ఎగురవేసేలా ప్రోత్సహించాలని కేంద్రం పేర్కొంది.