Independence Day 2022 : స్వాతంత్ర వేడుకలకు కరోనా ముప్పు-కేంద్రం హెచ్చరికలివే..
దేశవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. స్వాతంత్రం సిద్ధించి 75 పూర్తి చేసుకుంటున్న వేళ వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, ప్రజలు విరివిగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీలు, యాత్రలతో హంగామా చేస్తున్నారు. దీంతోపాటే కోవిడ్ వ్యాప్తి ముప్పు కూడా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని నియంత్రిచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం తాజాగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాస్కుల్ని తప్పనిసరి చేయడంతో పాటు వాటిని ధరించకపోతే రూ.500 ఫైన్ కూడా విధిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం స్వాతంత్ర్య వేడుకల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల్ని హెచ్చరించింది. ఈ మేరకు ఇవాళ ఆదేశాలు పంపింది.

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ సమావేశాలకు దూరంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. మరోవైపు అనేక రాష్ట్రాలు కోవిడ్ -19 భద్రతా చర్యలను కఠినతరం చేయడం ప్రారంభించాయి. మాస్క్లను తప్పనిసరి చేయడంతో సహా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
దేశంలో 16,561 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కోవిడ్ పాజిటివిటీ రేటు 5.44% వద్ద ఉంది.
ఢిల్లీ, ముంబైల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ డేటా ప్రకారం నిన్న దేశ రాజధాని ఢిల్లీలో 2,726 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు ఏడు నెలల్లో అత్యధికం. దీనితో పాటు కోవిడ్ వ్యాప్తి కారణంగా 6 మరణాలు కూడా నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications