పాకిస్తాన్ హైకమిషనర్ కు భారత్ సమన్లు-26/11 ముంబై దాడుల విచారణ వేగవంతానికి ఆదేశం
భారత్, పాకిస్తాన్ మధ్య చిచ్చు రేపిన నవంబర్ 26 ముంబై దాడులకు ఇవాళ్టితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ చేప్టటిన ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకుండా పోతోంది. దీంతో భారత్ ఇవాళ మరోసారి విచారణ వేగవంతం చేయాలని పాకిస్తాన్ ను కోరింది.
26/11 ముంబై ఉగ్రదాడుల 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాకిస్తాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తను భారత్ ఇవాళ పిలిపించింది. 15 దేశాలకు చెందిన 166 మంది బాధితుల కుటుంబాలు ఇంకా ఈ కేసు విచారణ పూర్తి కోసం ఎదురుచూస్తున్నాయని, ఈ కేసులో త్వరిత విచారణ చేపట్టాలని ఒత్తిడి తెచ్చింది. దౌత్యవేత్తకు అందజేసిన మౌఖిక నోట్లో, విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి తన నియంత్రణలో ఉన్న భూభాగాలను అనుమతించరాదనే అంశానికి కట్టుబడి ఉండాలని పాకిస్తాన్ను కోరింది.
ఉగ్రదాడి జరిగి 13 ఏళ్లు గడిచినా, ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన 166 మంది బాధితుల కుటుంబాలు ఇప్పటికీ ఈ కేసు విచారణ పూర్తి కోసం ఎదురుచూస్తున్నాయని, కానీ నేరస్థులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో పాకిస్తాన్ చిత్తశుద్ధి చూపడం లేదని భారత్ ఈ లేఖలో ఆరోపించింది. ఈ ఉగ్రవాద దాడిని పాక్ భూభాగం నుంచి ప్లాన్ చేసి, అమలు చేసి, ప్రయోగించారని విదేశాంగశాఖ తెలిపింది. ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని, భయంకరమైన దాడికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. ఇది ఉగ్రవాదుల చేతిలో పడిపోయిన అమాయక బాధితుల కుటుంబాలకు పాకిస్తాన్ జవాబుదారీతనం మాత్రమే కాదు, అంతర్జాతీయ బాధ్యత కూడా అని విదేశాంగశాఖ వివరించింది. దాడిలో బాధితులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని పేర్కొంది.
13 ఏళ్లక్రితం నవంబర్ 26, 2008న, పాకిస్తాన్ నుంచి 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైకు సముద్ర మార్గంలో వచ్చి విచక్షణా రహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు, 60 గంటల ముట్టడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ దాడిలో భారత్తోపాటు మరో 14 దేశాలు తమ పౌరులను కోల్పోయాయి. ఈ దేశాల్లోని భారతీయ మిషన్లు జాతీయ మరియు విదేశీ బాధితులను గుర్తుచేసుకుంటూ స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి,