కరోనా : భారత్ ఇప్పుడు ఏ దశలో ఉందంటే.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ వ్యాప్తిలో స్టేజ్-2,స్టేజ్-3లకు మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందన్న ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏకీభవించింది. అంతకుముందు ఎయిమ్స్ వైద్యుడు,కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ సభ్యుడు డా.రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందన్నారు. వైరస్ వ్యాప్తి దేశంలో స్టేజ్2,స్టేజ్ 3లకు మధ్యలో ఉందన్నారు. అయితే చాలా ప్రాంతాలు ఇప్పటికీ రెండో దశలోనే ఉన్నాయన్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ను గులేరియా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయన చెప్పిన దానికి,తాము చెబుతున్నదానికి తేడా ఏమీ లేదన్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో పరిమిత సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు అక్కడ క్లస్టర్ కంటైనర్ వ్యూహాన్ని అమలుచేస్తామని తెలిపారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం ప్రభుత్వ యాక్షన్,జోక్యం అవసరమవుతుందని స్పష్టం చేశారు.
'ఎక్కడైనా లోకల్ ట్రాన్స్మిషన్ జరిగితే మేమే మొదట అందరినీ అప్రమత్తం చేస్తాం. ఎయిమ్స్ డాక్టర్ చెప్పిన లోకల్ ట్రాన్స్మిషన్.. ఒకచోట ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గురించి..' అని అగర్వాల్ పేర్కొన్నారు.ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ వ్యాప్తిలో స్టేజ్-2,స్టేజ్-3లకు మధ్యలో ఉందని.. స్టేజ్-3కి చేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.
Recommended Video
కాగా,స్టేజ్-1లో కేవలం విదేశాల నుంచి వచ్చినవారిలో మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతాయి. స్టేజ్-2లో విదేశాల నుంచి వచ్చినవారిని కలిసినవారిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతాయి. స్టేజ్-3లో లోకల్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే,ఎవరి నుంచి ఎవరికి వైరస్ వ్యాప్తి చెందిందనేది గుర్తించడం కష్టంగా మారుతుంది.