ఫార్చ్యూన్: సత్య నాదెళ్లతో పాటు మరో ఇద్దరు సీఈవోలు
ఫార్చ్యూన్ జాబితాలో చోటు దక్కించుకున్న సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: ఈ ఏడాది మ్యాగజైన్ ఫార్చ్యూన్ అత్యుత్తమ వ్యాపారవేత్తల జాబితాలో తెలుగుతేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు చోటు దక్కింది. మొత్తం 50 మంది గ్లోబల్ కార్పొరేట్ హెడ్ల వివరాలతో ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన ఈ లిస్ట్లో ముగ్గురు భారతీయ సంతతి సీఈవోలకు స్థానం లభించింది.
ఆయనతో పాటు భారత్ కు చెందిన మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, హర్మన్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ దినేష్ పాలివాల్ లకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది. 50 మంది కార్పొరేట్ దిగ్గజాలతో ఫార్చ్యూన్ మేగజైన్ ‘బిజినెస్ పర్సన్ ఆప్ ది ఇయర్' పేరిట రూపొందిన ఈ జాబితాలో గూగుల్ సీఈఓ లారీ పేజ్ అగ్రస్థానంలో నిలవగా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రెండో స్థానంలో ఉన్నారు.
బంగాకు 28వ స్థానం లభించగా.. నాదెళ్ల 38వ, పలివాల్ 42వ స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అభివృద్ధి, ఆర్థిక అంశాల్లో అనిశ్చితి నెలకొనడంతోపాటు పలు దేశాల మధ్య యుద్ధవాతావరణంతో ఆందోళన పరిస్థితులు కొనసాగినప్పటికీ వీరు తమ సంస్థ వ్యాపారాలను పూర్తి సామర్థ్యం మేరకు ముందుకు తీసుకెళ్లగలిగారని ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది.