భారత్-చైనా సరిహద్దు వివాదంలో ట్విస్ట్: గ్రేట్ మూవ్: వాస్తవాధీన రేఖ వద్ద ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద సుమారు ఏడెనిమిది నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం.. మరో అనూహ్య మలుపు తీసుకుంది. ఉద్రిక్తతను చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పరస్పర అంగీకారానికి వచ్చారు. ఇది- రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు దేశాల నేతలు తీసుకున్న గొప్ప చర్యగా భావిస్తున్నారు.
Recommended Video
వేలమంది అక్కడే..
లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సరిహద్దు వెంబడి రెండు వైపులా వేలాదిమంది సైనికులు మోహరింపు కొనసాగుతోంది. ఇది వరకే గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో తన సైనికులను వెనక్కి పిలిపించింది. లఢక్ తూర్పు ప్రాంతం పరిధిలోని పాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో ఈ మోహరింపును కొనసాగించింది. సుమారు 40 వేల మంది వరకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు అక్కడ ఇప్పటికీ మోహరించే ఉంది. ఈ విషయంలో భారత్ కూడా వెనకడుగు వేయలేదు. ప్యాంగ్యాంగ్ త్సొ ప్రాంతానికి సైన్యాన్ని తరలించింది.
మూడు దశల్లో బలగాల ఉపసంహరణ..
వాస్తవాధీన రేఖకు రెండువైపులా సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరింపజేయడం వల్ల తూర్పు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారలేదు. దీన్ని నియంత్రించడానికి భారత్-చైనా సైన్యాధికారుల మధ్య దశలవారీగా చర్చలు కొనసాగుతూ వచ్చాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో భారత భూభాగంపైనున్న ఛుసుల్, అవతలి వైపు ఉన్న మోల్డో బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ వద్ద దశలవారీగా చర్చలను నిర్వహించారు. చివరికి అవి సుఖాంతానికి దారి తీశాయి. మూడుదశల్లో బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికి రెండుదేశాల సైన్యాధికారుల మధ్య అంగీకారం కుదిరింది.
ఈ నెల 6 నాటి భేటీలో..
సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకోవాలనే సింగిల్ అజెండా కింద ఈ నెల 6వ తేదీన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహించారు. ఛుసుల్లోని బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ వద్ద సుదీర్ఘంగా కొనసాగాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఘాయ్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడానికి పరస్పరం అంగీకరించారు.
మూడు రోజుల్లోనే 30 శాతం..
ఇందులో భాగంగా మూడు రోజుల్లో తొలిదశ తరలింపును చేపట్టాలని, ఫింగర్-8 ప్రాంతంలో మోహరించి ఉన్న సైనిక బలగాల్లో 30 శాతం మేర జవాన్లు, ఇతర సామాగ్రిని ఉపసంహరించేలా ఒప్పందం కుదిరింది. చివరిదైన మూడోదశలో ఛుసుల్, రేజంగ్ లా ఏరియా, పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి వెనక్కి మళ్లడానికి ఒప్పుకొన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగుతోందా? లేదా? అనే విషయాన్ని మానవ రహిత ఏరియల్ వెహికల్ ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయించారు.
దొంగదెబ్బ కొడుతుందా?
చైనా పీఎల్ఏ సాయుధ బలగాలు తమ మాటను నిలబెట్టుకుంటాయా? లేదా? అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. ఇదివరకు గాల్వన్ వ్యాలీ వద్ద వెనక్కి వెళ్లినట్టే వెళ్లిన పీఎల్ఏ బలగాలు రెట్టించిన శక్తితో దూసుకొచ్చాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత ఫ్రంట్లైన్ జవాన్లతో ఘర్షణకు దిగాయి. 20 మంది జవాన్ల మరణానికి కారణం అయ్యాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఒకసారి చైనా ఇచ్చిన మాట తప్పిందని, భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించిందని, ఈ సారి ఆ పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.