చైనా మరో అనూహ్య చర్య.. చర్చల వేళ సడెన్గా ఆర్మీ కమాండర్ మార్పు.. భారత్ నుంచి ఎవరంటే..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సమయంలోనే డ్రాగన్ దేశం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. చరిత్రలో మొట్టమొదటిసారి రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం చర్చలు జరుపనుండగా.. చైనా సడెన్గా తన ఆర్మీ కమాండర్ను మార్చేసింది. 3,488 కిలోమీటర్ల పొడవున్నఎల్ఏసీలో సైనిక కలాపాలను పర్యవేక్షించే 'వెస్ట్రన్ థియేటర్ కమాండ్' సారధిగా లెఫ్టినెట్ జనరల్ క్వీలింగ్ను నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
Recommended Video

అతిపెద్ద కమాండ్..
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ లేదా చైనా ఆర్మీ)కి సంబంధించి మొత్తం ఐదు థియేటర్ కమాండ్స్ ఉన్నాయి. వాటిలో భారత సరిహద్దు వ్యవహారాలను చూసే వెస్ట్రన్ థియేటర్ కమాండే అతి పెద్దది కావడం గమనార్హం. వెస్ట్రన్ కమాండ్ లో సైనిక వ్యవహారాల చీఫ్ గా నియమితుడైన లెఫ్టినెట్ జనరల్ క్వీలింగ్.. గతంలో ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ లో పనిచేశారని, ఇవాళ్టి నుంచి ఆయన.. పశ్చిమ థియేటర్ కమాండ్ ఓవరాల్ చీఫ్ జనరల్ జావో జాంగీకు రిపోర్టు చేస్తారని నియామక ప్రకటనలో పేర్కొన్నారు.

సర్వత్రా టెన్షన్..
భారత్-చైనాల మధ్య తాజా వివాదానికి కేంద్రబిందువులుగా ఉన్న పాంగాంగ్, హాట్ స్ప్రింగ్, గాల్వాన్ లోయలో ఇరువైపుల బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 60 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన నేపథ్యంలో.. డ్రాగన్ సైన్యాలు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని, ఏప్రిల్ 1నాటి స్టేటస్ కో తిరిగి పునరుద్ధరించాలని భారత్ పట్టుపడుతున్నది. ఇందుకోసం ఇప్పటికే మేజర్ జనరల్స్ స్థాయిలో 10 సార్లకుపైగా జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. చర్చలు సక్సెస్ అవుతాయా? లేక చైనా కోరుతున్నట్లు యుద్ధమే వస్తుందా? అనేదానిపై సర్వత్రా టెన్షన్ కొనసాగుతున్నది. భారత-చైనా చర్చలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కాగా..

చర్చలు ఎక్కడంటే..
సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం శనివారం జరగనున్న కీలక చర్చలకు తూర్పు లదాక్ లోని స్పంగూర్ గ్యాప్ సమీపంగా ఉన్న చూషుల్ ప్రాంతం వేదిక కానుంది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చైనాతో చర్చల్లో భారత్ తరఫున 14వ కార్ప్స్ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ పాల్గొంటారని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఇప్పటికే లదాక్ లో మకాం వేసి ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

అందుకే కట్టుబడ్డామన్న చైనా..
వివాదాల పరిష్కారం కోసం తొలిసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో జరుగుతోన్న చర్చలపై తాము కూడా ఆశభావంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ అన్నారు. శుక్రవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘సరిహద్దు నిర్వహణకు సంబంధించి మాకు పూర్తిస్థాయి యంత్రాంగం ఉంది. ఇండియాతో మేం స్నేహాన్నే కోరుతున్నాం. సముచిత పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇండియాతో పంచుకుంటున్నాం''అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications