అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటే
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాజాగా పాంగాంగ్ సరస్సుకు దక్షిణంవైపున సరిహద్దుల్ని మార్చేసేందుకు చైనా ప్రయత్నించగా.. భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో డ్రాగన్ తోకముడిచిందని ఆర్మీ సోమవారం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం చెబుతున్నదానికంటే పెద్ద సంఘటనే అక్కడ జరిగి ఉండొచ్చని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు. మరోవైపు చైనా తాజా దూకుడు చర్యపై ఢిల్లీలోనూ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం తూర్పు లదాక్ లో ఏం జరిగిందంటే..

రాత్రి 11కు, సరిగ్గా అక్కడ..
ఎల్ఏసీ వెంబడి భారీగా బలగాలను మోహరించిన చైనా మే 5 నుంచి తూర్పు లదాక్ లో తరచూ కవ్వింపులు, ఘర్షణలకు దిగుతున్నది. తొలుత గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సుకు ఉత్తరం దిక్కున ఉండే ఫింగర్ పాయింట్స్, హాట్ స్ప్రింగ్స్ తదితర ప్రాంతాల్లో సరిహద్దును మార్చేసేందుకు చైనా ప్రయత్నించింది. జూన్ 15నాటి హింసాత్మక ఘర్షణ తర్వాత రూటు మార్చిన చైనా.. దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో సైనిక శిబిరాలు నిర్మించి సవాళ్లు విసిరింది. ఉద్రిక్తతల నివారణ కోసం చర్చలు జరుగుతుండగానే.. తాజాగా పాంగాంగ్ సరస్సుకు దక్షిణ భాగంలో(ఫింగర్ పాయింట్స్కు అభిముఖంగా) చుశూల్, స్పాన్గుర్ గ్యాప్ ప్రాంతాల్లో సరిహద్దుల్ని చెరిపేందుకు యత్నించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము దాకా అక్కడేం జరిగిందనే విషయాలను భారత ఆర్మీ వెల్లడించింది.

200 మంది డ్రాగన్ సైనికులు..
5 కిలోమీటర్ల వెడల్పు, 604 కిలోమీటర్ల పొడవుండే పాంగాంగ్ సరస్సు 60 శాతం టిబెట్ పరిధిలో, 40 శాతం మన పరిధిలో ఉందన్న సంగతి తెలిసిందే. సరస్సుకు ఉత్తర దిశలోని బంజరు పర్వతాలకు సైనిక పరంగా ప్రాధాన్యం ఉంది. చేతివేళ్లను పోలిన ఈ పర్వతాలను ఫింగర్ పాయింట్స్ అంటారు. అయితే, శనివారం నాటి ఆక్రమణలో చైనా వ్యూహాత్మకంగా ఫింగర్ పాయింట్స్ ను కాకుండా పాంగాంగ్ సరస్సుకు ఉత్తర దిశలోని పర్వతాల్లో అలజడి రేపింది. కాన్వాయ్ గా వచ్చిన ఎస్యూవీ వాహనాల్లో 200 మంది చైనా జవాన్లు ఈ దురాక్రమణ యత్నంలో పాలుపంచుకున్నట్లు భారత ఆర్మీ తెలిపింది.

చేయి వేసే సాహసం చేయలేదు..
పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోకి చైనా చొరబడొచ్చన్న అనుమానంతో భారత్ ముందుగానే అక్కడ బలగాలను మోహరించింది. సరిహద్దులు చెరిపేందుకు అక్కడికొచ్చిన 200 మంది చైనా జవాన్లు.. మనోళ్లను చూసి దాదాపు స్థాణువైపోయారు. బండ్లు దిగి, కొందరు ఆ ప్రాంతమంతా కలియదిరుగగా, ఇంకొందరు సైనికులేమో భారత పోస్టుకు దగ్గరగా వచ్చి నిలబడి సవాలు విసురుతున్నట్లు పోజిచ్చారు. ఇలా కొన్ని గంటలపాటు అక్కడ ఉద్రిక్తత కొనసాగింది. అయితే, భౌతిక ఘర్షణలుగానీ, తోపులాటగానీ అక్కడ చోటుచేసుకోలేదని, భారత్ అప్రమత్తంగా ఉందన్న సంగతి అర్థమైన తర్వాత డ్రాగన్ బలగాలు తోకముడిచాయని సైనిక వర్గాలు తెలిపాయి.
Recommended Video

వాస్తవాలను దాస్తున్నారు..
పాంగాంగ్ సరస్సు దక్షిణ దిశలోని చుశూల్, స్పాన్గుర్ గ్యాప్ ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న సంఘటనలపై ప్రభత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని మాజీ ఆర్మీ అధికారి, జర్నలిస్టు అజయ్ శుక్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆర్మీ ప్రకటించిన దానికంటే పెద్ద సంఘటనే అక్కడ జరిగి ఉంటుంది. నిజానికి ఈ విషయంలో మనం ఆర్మీని తప్పుపట్టలేం. ఎందుకంటే చైనాతో చర్చలు తక్షణలే నిలిపేసి, సైనిక చర్యకు దిగాలని ఆర్మీ కోరుతోంది. కానీ ఢిల్లీలోని కేంద్ర సర్కారు మాత్రం తాత్సారం చేస్తున్నది. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పకుంటే ఇలాంటివి ఇంకా జరుగుతాయి''అని శుక్లా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications