చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్.. జవాన్లకు నివాళి..
రాళ్లు, ఇనుప కంచెలు చుట్టిన కర్రలతో అతికిరాతకంగా భారత సైనికులను హతమార్చిన చైనా దురాగతాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పెదవివిప్పారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి దాదాపు రెండు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతకు కొనసాగింపుగా సోమవారం గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగడం, గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

వీడియో సందేశం..
తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై ప్రతిపక్ష పార్టీలు సందేహాలకుతోడు ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చైనా సరిహద్దుకు సంబంధించి ఇండియా స్టాండ్ ను మరోసారి గుర్తుచేశారు. అదే సమయంలో డ్రాగన్ కు హెచ్చరికలు సైతం జారీచేశారు.

మోదీ ఏమన్నారంటే..
‘‘ప్రస్తుత సందర్భంలో దేశప్రజలకు నేను ఒకటే భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మన జవాన్ల త్యాగం వృధాకాబోదు.. కచ్చితంగా అమరుల త్యాగం ఫలించి తీరుతుంది. భారతీయులకు ఐక్యత, సార్వభౌమాధికారం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఏనాడైనా మనం శాంతినే కోరుకుంటాం. శాంతిపంథాను మాత్రమే అనుసరిస్తాం. అయితే, ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తే మాత్రం తగిన రీతిలో ఘాటుగా బదులు చెప్పడానికి వెనుకాడబోము''అని ప్రధాని మోదీ చైనా పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు. తాజా ఉద్రిక్తత, ఘర్షణల నేపథ్యంలో ప్రధాని బహిరంగంగా మాట్లాడం ఇదే తొలిసారి.

అమరులకు నివాళులు..
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ సమావేశంలోనూ చైనా సరిహద్దు అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన ఈ కాన్ఫరెన్స్ లో.. గాల్వాన్ లోయతోపాటు ఎల్ఏసీ వెంబడి నెలకొన్న వాస్తవ పరిస్థితులను సీఎంలకు బ్రీఫింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సమావేశం ప్రారంభంలోనే.. అమరులైన 20 మంది జవాన్లకు ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

21న కీలక సందేశం..
గాల్వాన్ లోయలో భారత సైనికుల మరణాలు, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19న(శుక్రవారం) జరగబోయే భేటీకి సంబంధించి ఈమేరకు ఆయా పార్టీలకు సమాచారమిచ్చారు. అయితే ఆల్ పార్టీ మీటింగ్ కు మోదీ, షా కూడా వస్తారా? లేక గతంలో మాదిరే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సారధ్యం వహిస్తారా? అనేది తెలియాల్సిఉంది. ఆల్ పార్టీ మీటింగ్ లో వెల్లడయ్యే అభిప్రాయాలు, రాబోయే రోజుల్లో చైనా నుంచి వెలువడే ప్రకటనలకు అనుగుణంగా ప్రధాని మోదీ ఈనెల 21న జాతినుద్దేశించి కీలక సందేశం ఇస్తారని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.
Recommended Video

కరోనాపై సీఎంలకు సూచనలు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. రికవరీ రేటు రికార్డు స్థాయిలో ఉండటం ఊరటనిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.. కొవిడ్-19, లాక్ డౌన్, ఎకానమీ అంశాలను ప్రస్తావించారు. పెరుగుతోన్న కేసులకు అనుగుణంగా ఆరోగ్య రంగంలో వసతుల్ని పెంచాలని సూచించారు. గడిచిన మూడు నెలల్లో పీపీఈ కిట్స్, మాస్కుల కొరతను అధిగమించగలిగామని చెప్పారు.












Click it and Unblock the Notifications