సరిహద్దులో శాంతి: బీజింగ్ వేదికగా భారత్-చైనా ప్రతినిధుల కీలక సమావేశం
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న ప్రతిష్ఠంభనపై భారత్, చైనా అధికారులు బీజింగ్లో బుధవారం మరో రౌండ్ దౌత్య చర్చలు జరిపారు.
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంపై కీలక చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న ప్రతిష్ఠంభనపై భారత్, చైనా అధికారులు బీజింగ్లో బుధవారం మరో రౌండ్ దౌత్య చర్చలు జరిపారు. ఫ్రంట్ లైన్ దళాలను ఉపసంహరించుకోవడమే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో సహాయపడుతుందని భారత్ స్పష్టం చేసింది.
అయితే, దళాల ఉపసంహరణ ప్రతిపాదనలపై చర్చల్లో పురోగతికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఇప్పుడే తీసుకోలేదని తెలిసింది. భారతదేశం-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) కింద చర్చలు జరిగాయి. జూలై 2019లో జరిగిన 14వ సమావేశం తర్వాత ఇది మొదటి వ్యక్తిగత సమావేశం కావడం గమనార్హం.సరిహద్దులో శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి.

"ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్లకు అనుగుణంగా ఈ లక్ష్యాన్ని సాధించడానికి, సీనియర్ కమాండర్ల సమావేశం తదుపరి (18వ) రౌండ్ను ముందస్తు తేదీలో నిర్వహించడానికి వారు అంగీకరించారు. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి' అని ఒక ప్రకటనలో వెల్లడించారు.
డబ్ల్యుఎంసీసీ సమావేశంలో భారత పక్షానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహించారు.
కాగా, గల్వాన్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య కొంత దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు ముందుకొచ్చాయి. అనంతరం పలుమార్లు చర్చలు జరిగాయి. చర్చలు సాగిస్తూనే సరిహద్దులో చైనా బలగాలు ఉద్రిక్తతకు కారణమవుతూ వచ్చాయి. చిన్నపాటి ఘర్షణలు తర్వాత కూడా చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద భారీ మోహరింపులను ఉపసంహరించుకుంటూనే చర్చలు సఫలమవుతాయని భారత్ స్ఫష్టం చేసింది. దీంతో ఇరు దేశాలు దళాలను కొంతమేర ఉపసంహరించుకున్నాయి. కానీ, పూర్తిస్థాయిలో మాత్రం బలగాల ఉపసంహరణ జరగలేదు. ఇరుదేశాల సరిహద్దులో కొంత శాంతియుత వాతావరణం నెలకొన్నప్పటికీ.. చైనా మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోంది. సరిహద్దులో ఆ దేశ ఆధీనంలోని ప్రాంతాల్లో పలు నిర్మాణాలను కూడా చేపట్టింది. భారత్ కూడా సరిహద్దులో రహదారులను నిర్మించింది. ఇలా పరోక్షంగా ఉద్రిక్త వాతావరణమే ఇరు దేశాల సరిహద్దులో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications