చైనా కిరాతకం: 200 రౌండ్ల కాల్పులు - ఫింగర్ 4 వద్ద ఘటన -చుషూల్ కంటే డేంజరస్ - మాస్కో డీల్కు ముందు
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి హైవోల్టేజ్ టెన్షన్ కొనసాగుతున్నది. సైనిక, దౌత్య మార్గాల్లో దఫదఫాలుగా జరుగుతోన్న చర్చలు విఫలం అవుతున్నకొద్దీ సరిహద్దులో అశాంతి తారాస్థాయికి చేరుతున్నది. మరీ ప్రధానంగా.. ఇటీవల భారత్ కీలకమైన స్థావరాలపై పట్టుబిగించడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ క్రమంలోనే డ్రాగన్ కిరాతకంగా కాల్పులకు దిగుతున్నది. 45 సంవత్సరాల శాంతికి విఘాతం కలిగిస్తూ డ్రాగన్ కాల్పులకు దిగింది. సరిగ్గా మాస్కో వేదికగా రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి కొద్దిగా ముందు కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. సైనిక, ప్రభుత్వ వర్గాలను కోట్ చేస్తూ ప్రఖ్యాత 'ఇండియన్ ఎక్స్ ప్రెస్(ఐఈ)' వెలువరించిన సంచలన కథనం వివరాలివి..
Recommended Video

20 రోజుల్లో మూడు సార్లు..
వేసవి ప్రారంభానికి ముందే వేలాది మంది అదనపు బలగాలను, భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని సరిహద్దులకు తరలించిన చైనా.. మే మొదటి వారం నుంచి మన బలగాలకు ఎదురుగా నిలబడి కవ్వింపులకు పాల్పడుతున్నది. గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాగ్ సరస్సుకు రెండు దిశలా, దౌలత్ బేగ్ ఓల్డీ, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ పాయింట్ల వద్ద చైనా ఆగడాలు శృతిమించాయి. గడిచిన 20 రోజుల్లో ఏకంగా మూడు సార్లు కాల్పుల ఉదంతం చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజస్తున్నది. 45 ఏళ్ల తర్వాత తొలిసారి ఈఏడాది ఆగస్టు 29-30 రాత్రివేళ పాంగాంగ్ సరస్సు దక్షిణం ఒడ్డున.. చైనా 10 రౌండ్ల కాల్పులు జరిపిందని, ప్రతిగా భారత్ కూడా ఎదురు కాల్పులు జరిపిందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. అంతకంటే భయానకంగా మరో రెండు ఘటనలు సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చోటుచేసుకున్నాయని ‘ఐఈ) తాజా కథనంలో పేర్కొంది.

బ్లాక్ టాప్ స్వాధీనంతో బెంబేలు..
పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే పర్వతాలు చుషూల్ సెక్టార్ కిందికి వాస్తాయి. హెల్మెంట్, బ్లాక్ టాప్, గురుంగ్ హిల్, మగర్ హిల్, రేజంగ్ లా, ముఖ్పరీ పర్వతం తదితర వ్యూహాత్మక శిఖరాలన్నీ ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వివాదరహితంగా ఉన్న ఈ ప్రాంతాలపై చైనా కన్నేసిందన్న సమాచారంతో మనవాళ్లు ముందుగానే వాటిని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్ని చెరిపేసేందుకు దండుగా వచ్చిన చైనా సైనికులు.. మనవాళ్లు ముందే అక్కడ ఉండటాన్ని చూసి ఖంగుతిన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 7న మక్బరీ పర్వతంపై రెండోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 29-30 నాటి ఘటనను అధికారికంగా వెల్లడించిన భారత సైన్యం.. రెండో, మూడో కాల్పుల ఘటనను మాత్రం విశ్వసనీయ వర్గాల ద్వారా బయటపెట్టడం గమనార్హం.

200 మీటర్ల దూరంలో నిలబడి 200 రౌండ్లు..
మన కథనంలో అతి ముఖ్యమైన అంశం.. ఈనెల 8న చోటుచేసుకున్న మూడో దఫా కాల్పుల ఉదంతం. మొదటి రెండు ఉదంతాలు పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో చోటుచేసుకోగా.. మూడోది, అతి తీవ్రమైన ఘటనగా భావిస్తోన్న ఉదంతం మాత్రం పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగంలో.. అంటే, ఫింగర్ పాయింట్స్ వద్ద చోటుచేసుకుంది. రెండు దేశాలూ కీలకంగా భావించే ఫింగర్ 4 ప్రాంతంపై పట్టు కోసం అక్కడ మినీ యుద్ధం లాంటిదే జరిగినట్లు ‘ఐఈ' తెలిపింది. సెప్టెంబర్ 8నాటి కాల్పుల ఘటన ఫింగర్ 3 నుంచి ఫింగర్ 4 మధ్యలో చోటుచేసుకుందని, ఇరు దేశాల సైనికులు కేవలం 200 మీటర్ల దూరంలో ఎదురెదురుగా నిలిచిన సమయంలో 100 నుంచి 200 రౌండ్ల మేరకు గాల్లోకి కాల్పులు జరిగాయని ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పనట్లు కథనంలో రాశారు.

మాస్కో ఒప్పందానికి కొద్దిగా ముందు..
ఆగస్టు 29-30 నాటి కాల్పులపై భారత సైన్యం ప్రకటన చేయగా, సెప్టెంబర్ 7 నాటి కాల్పులపై చైనా నుంచి ప్రకటన వెలువడింది. అయితే సదరు ప్రకటనను భారత్ ఖండించింది. సెప్టెంబర్ 8 నాటి భీకర కాల్పులపై మాత్రం రెండు దేశాలూ అధికారిక ప్రకటనలకు దూరంగా ఉండటం గమనార్హం. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో భాగంగా భారత్, చైనా విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ భేటీ కావడానికి ముందు భారీ కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.

చర్చలకు ముందు ఇదో స్ట్రాటజీ..
చైనాకు సరిహద్దు దేశంగా భారత్ కు డ్రాగన్ పోకడలు, కుయుక్తులు తెలియనివేమీ కాదు. చర్చలకు ముందు ఉద్రిక్తతలను పెంచం, తద్వారా ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసి, తాను లబ్ది పొందేందుకు ప్రయత్నించడం చైనా ఎప్పటి నుంచో అవలంభిస్తున్న స్ట్రాటజీనే. గతంలో రాయబారిగానూ పనిచేసిన అనుభవం, చైనా కుయుక్తులపై అవగాహన ఉండబట్టే మంత్రి జైశంకర్ చర్చల్లో ఏమాత్రం తగ్గకుండా వ్యవహరించారు. దీంతో చివరికి చైనా ఐదు ఒప్పందాలకు అంగీకారం చెప్పక తప్పలేదు. సరిహద్దులో ఉద్రిక్తతల సడలింపునకు కట్టుబడి ఉన్నామని చెప్పకా తప్పలేదు. విదేశాంగ మంత్రుల ఉమ్మడి ప్రకటన తర్వాత ఎల్ఏసీ వెంబడి కాల్పులు జరిగిన ప్రాంతాల్లో ఎట్టకేలకు వాతావరణం చల్లబడింది.












Click it and Unblock the Notifications