పెరుగుతున్న కరోనా కేసులు: 4 నెలల తర్వాత 3 శాతాన్ని దాటిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8084 కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దాదాపు నాలుగు నెలల తర్వాత సోమవారం కోవిడ్ పాజిటివిటీ రేటు 3.24 శాతం కంటే ఎక్కువైంది.
ఫిబ్రవరి 13న భారతదేశం రోజువారీ పాజిటివిటీ రేటు 3.17%. ఫిబ్రవరి 15న ఇది 2.23 శాతానికి పడిపోయింది. సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,32,301,01కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 47,995కు చేరింది.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 5,24,771కు చేరింది.
ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. సోమవారం 4,592 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు, 4,26,57,335 మంది రోగులు వైరస్ నుంచి కోలుకున్నారు. భారతదేశం రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది.
కాగా, భారతదేశం ఇప్పటి వరకు 195.19 కోట్ల వ్యాక్సిన్ డోస్లను అందించింది. మూడవ ముందు జాగ్రత్త మోతాదు(బూస్టర్ డోసు) 3,89,35,251 పెద్దలకు ఇవ్వబడింది. జూన్ 9న కొత్త లేదా కరోనావైరస్ కేసుల సమూహాలలో నమోదయ్యే ప్రాంతాలలో అధిక స్థాయి పరీక్షలు ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖలో సూచించారు. పరీక్ష, ట్రాక్, చికిత్స, టీకాలు వేయడం, కరోనావైరస్-సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండాలి.