వినాశకర పరిస్థితులు గుర్తు చేశాయి: భారత్లో కరోనా మహమ్మారి విజృంభణపై డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: సెకండ్ వేవ్లో భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తుండటపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనావైరస్ను నిర్లక్ష్యం చేస్తే.. ఏ స్థాయిలో విజృంభించగలదో వినాశనకరంగా మరోసారి గుర్తు చేసిందని అన్నారు.
భారతదేశంలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని తమకు తెలుసని, వాటిని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా వేర్వేరు అవసరాలున్నాయన్నారు. కరోనా కట్టడికి, టీకా ఉత్పత్తి నిమిత్తం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని టెడ్రోస్ తెలిపారు. కరోనాతో ఆప్తులను కోల్పోయినవారికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కరోనా మహమ్మారి ఏమి చేయగలదో భారతదేశంలోని పరిస్థితులే వినాశకరంగా గుర్తు చేస్తున్నాయన్నారు. ప్రజారోగ్య చర్యలు, టీకాలు, చికిత్స వంటి సమగ్ర విధానాలతో వైరస్కు వ్యతిరేకంగా ముందుకెళ్లాలని భారత్కు సూచించారు. కరోనావైరస్ను తక్కువగా అంచనా వేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రపంచ దేశాలను ఆయన హెచ్చరించారు.
కరోనా నిబంధనలను పాటించకపోవడం, వ్యాక్సిన్ తీసుకోకపోవడం లాంటి నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, భారత్లో ఇటీవల కాలంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆక్సిజన్ కొరత కారణంగా సుమారు 50 మందికిపైగా కరోనా రోగులు దేశ వ్యాప్తంగా మరణించారు. గత 24 గంటల్లో దేశంలో 3.46 లక్షల మందికి కరోనా సోకగా, 2624 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడం జరుగుతోంది. అవసర ఉన్న రాష్ట్రాలకు మొదట అందజేయడం జరుగుతోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి కూడా పెంచి అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.