పాక్ కు దిమ్మదిరిగేలా భారత్ వ్యూహాం! ఆ అస్త్రంతోనే దెబ్బతీసేందుకు ప్లాన్
న్యూఢిల్లీ : ఉగ్రదాడులతో భారత్ ను విచ్చిన్నం చేయాలన్న పాక్ కుయుక్తులను గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేయబోతుంది కేంద్రం. ఇందుకోసం అంతర్జాతీయ వేదికలను అస్త్రంగా మలుచుకోబోతుంది. పాక్ ద్వంద్వ నీతిని అంతర్జాతీయ వేదికల మీద బహిర్గతం చేయడం ద్వారా ఆ దేశ దౌత్య సంబంధాలను దెబ్బ తీయాలనే యోచనలో ఉంది కేంద్రం.
యురీ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పాక్ పై నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో.. ఇక ఉపేక్షించడం ఎంతమాత్రం సమంజసం కాదనే నిర్ణయానికి వచ్చింది కేంద్రం. అందుకు తగ్గట్టు పాక్ దౌత్య సంబంధాలను విచ్చిన్నం చేయడానికి వ్యూహాలను రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికల ద్వారా పాక్ ఉగ్ర పోకడలను ఎత్తి చూపి.. మిగతా దేశాలేవి పాక్ తో దౌత్య సంబంధాలు నెరపనంతగా ప్రభావితం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది.
యురీలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడులు 18మంది సైనికులు చనిపోవడం దేశమంతటిని కలచివేసింది. దీంతో పాక్ చర్యలకు చెక్ చెప్పేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని మోడీ. సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ తో పాటు పీఎంవో కార్యాలయ అధికారులు, రక్షణ శాఖ మరియు హోం శాఖ అధికారులు పాల్గొన్నారు.
పాక్ దౌత్య సంబంధాలను దెబ్బ తీయడమే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోన్న కేంద్రం.. అంతర్జాతీయంగా పాక్ ను ఒంటరి చేయడానికి పాక్ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన పక్కా ఆధారాలను పూర్తి వివరాలతో సహా అంతర్జాతీయ వేదికల్లో ప్రపంచ దేశాల ముందు పెట్టాలని యోచిస్తోంది. త్వరలోనే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఐరాస వేదికగా పాక్ దుర్నీతికి గట్టిగా బుద్ది చెప్పి పాక్ ను ఏకాకి చేయాలని కేంద్రం భావిస్తోంది. కాగా, ఈ విషయంపై మరింత సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరముందని అధికార వర్గాలు వెల్లడించినట్లుగా సమాచారం.