మోదీపై అమెరికా వివాదాస్పద కామెంట్స్ - భారత్ అభ్యంతరం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతోన్నాయి. వివాదాస్పదంగా మారిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యకేసుతో ముడిపెట్టి అమెరికా ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని పట్ల భారత్ స్పందించింది. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు సరికావని పేర్కొంది.
జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ను అమెరికా ప్రభుత్వం ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించిన విషయం తెలిసిందే. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇదే రకంగా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించినట్లు అమెరికా ఇటీవలే వ్యాఖ్యానించింది. జమాల్ ఖషొగ్గి హత్యోదంతంలో బిన్ సల్మాన్తో ప్రధాని మోదీ ప్రాసిక్యూషన్ అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రస్తావించారు.
ఖషోగ్గి హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొన్న మహ్మద్ బిన్ సల్మాన్కు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని గతంలో ప్రధాని మోదీ ఉదంతం పోల్చారు. వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు ఆయన ఈ రకమైన సమాధానాన్ని ఇచ్చారు. వాటిపై వివరణ ఇచ్చారు. గతంలో మోదీకి అదే తరహాలో ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించిన విషయాన్ని వేదాంత్ పటేల్ గుర్తు చేశారు.
అమెరికా ఈ విధానాన్ని అవలంభించడం ఇది మొదటిసారేమీ కాదని, గతంలో కూడా పలువురు దేశాధినేతలు, ప్రధానమంత్రులకు ఇదే రకమైన మినహాయింపులను ఇచ్చామని గుర్తు చేశారు. 1993లో హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్, 2001లో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, 2014లో నరేంద్ర మోదీ, 2018లో డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో అధ్యక్షుడు కబీలాకు తమ దేశ ప్రాసిక్యూషన్ నుంచి ఈ రక్షణను కల్పించామని వివరించారు. విదేశాంగ మంత్రుల కూడా ఈ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల పట్ల భారత్ తాజాగా స్పందించింది. అలాంటి వ్యాఖ్యలు సరికాదని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీపై అమెరికా చేసిన వ్యాఖ్యలు సందర్భోచితమా? కాదా? అనేది తనకు అర్థం కావట్లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. వాటిని ప్రస్తావించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందని చెప్పారు. భారత్-అమెరికా మధ్య సుహృద్భావ వాతావరణంలో దౌత్య సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేయాల్సి వస్తోందని అన్నారు.