INDIA : ఇండియా కూటమి మరో అప్ డేట్-ముంబై భేటీలో లోగో విడుదల..
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన ఇండియా కూటమి.. ఇప్పుడు ముంబైలో మూడో భేటీకి సిద్దమవుతోంది. ఆగస్టు 31న జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న కూటమి పార్టీలు.. అలాగే ఉమ్మడి లోగో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ వెల్లడించారు.
కొత్తగా ఏర్పడిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) లోగోను ముంబైలో జరిగే కూటమి మూడవ ఉమ్మడి సమావేశంలో ఆగస్ 31న ఆవిష్కరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి ఈసారి తమ వ్యక్తిగత అజెండాల్ని పక్కనబెట్టి ఒకే లోగో కింద పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా తామెంత ఐక్యంగా ఉన్నామో జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో అశోక్ చవాన్ మాట్లాడుతూ... ముంబైలో జరిగే ఉమ్మడి ఇండియా కూటమి భేటీలో దాదాపు 26 నుండి 27 పార్టీలు పాల్గొంటాయని తెలిపారు. ఆగస్ట్ 31 సాయంత్రం ముంబైలో అనధికారిక సమావేశం, సెప్టెంబర్ 1 న అధికారిక సమావేశం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు రెండు సమావేశాలు నిర్వహించాం కాబట్టి ఈ మూడవ సమావేశంలో తదుపరి ఎజెండాపై చర్చిస్తారన్నారు. అలాగే తాము ఓ ఉమ్మడి లోగోను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీన్ని ఆగస్టు 31న ఆవిష్కరిస్తామన్నారు.

ఇండియా కూటమి మొదటి సమావేశం ఇందులో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్-జేడీయూ-ఆర్జేడీ అధికారంలో ఉన్న బీహార్లోని పాట్నాలో జరిగింది. అలాగే రెండవది కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఇప్పుడు మూడో భేటీ అధికారంలో లేని మహారాష్ట్రలోని ముంబైలో జరగబోతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత కూటమికి ప్రధాని పేర్లను వెల్లడిస్తామని పార్టీ నేత పీఎల్ పునియా అంతకుముందు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానిని నిర్ణయిస్తామని భారత కూటమి నిర్ణయించింది.












Click it and Unblock the Notifications