దేశంలో తొలిసారి: కళాశాల ప్రిన్సిపాల్గా హిజ్రా
కోల్కతా: భారతదేశంలో తొలిసారి ఓ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన తొలి హిజ్రాగా మనాబీ బందోపాధ్యాయ్ ఘనత సాధించనున్నారు. పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్ మహిళా కళాశాల పిన్సిపాల్గా ఆమెను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అంతకుముందు వరకు మనాబీ.. వివేకానంద సతోబార్షికీ మహావిద్యాలయలో బెంగాలీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ట్రాన్స్ జండర్... కాలేజీ ప్రిన్సిపాల్ కావడం దేశంలో కాదు బహుశా ప్రపంచంలోనే ఇది ప్రథమం కావచ్చు. అయితే మనాబీ బందోపాధ్యాయ్ నియామకం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తెలిపారు.
కాగా, తనను కళాశాల ప్రిన్సిపాల్ నియమించడం పట్ల మనాబీ బందోపాధ్యాయ్ ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 9న మనాబీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
కాలేజీ సర్వీసు కమిషన్ నిర్ణయం మేరకే ఆమెను ప్రిన్సిపాల్గా నియమించారని వెల్లడించారు. కాలేజీని బాగా నడిపించేందుకు బలమైన వ్యక్తిత్వం కలిగిన ప్రిన్సిపాల్ ఉండాలన్న ఉద్దేశంతో బందోపాధ్యాయ్ను ఎంపిక చేశామని మహిళా కళాశాల పాలక మండలి అధ్యక్షుడుగా ఉన్న సాంకేతిక విద్యాశాఖ మంత్రి రతన్ లాల్ హంగ్లూ తెలిపారు.
బందోపాధ్యాయ్ నియామకాన్ని కళ్యాణి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వాగతించారు. కృష్ణానగర్ మహిళా కళాశాల... కళ్యాణి యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఇక బందోపాధ్యాయ్ కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.