భారత్ గౌరవం కోల్పోతోంది: కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ ఫారెన్ పాలసీ సరిగా లేదని, దీంతో దేశం శక్తిని, గౌరవాన్ని కోల్పోతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏం చేయాలో కూడా తెలియదని రాహుల్ వ్యాఖ్యానించారు.
భారత్ ఒప్పందం కుదుర్చుకున్న ఛాబహార్ రైల్ ప్రాజెక్టును ఇరాన్ రద్దు చేసుకోవడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఫారెన్ పాలసీని సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

కాగా, రాహుల్ విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. భారతదేశానికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్న తీరు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచంలో భారత గౌరవం మరింత పెరిగిందని స్పష్టం చేసింది.
ఇది ఇలావుండగా, రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై రాహుల్ గాంధీ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టూడెంట్ వింగ్ విభాగం ఎన్ఎస్యూఐ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పార్టీని వీడాలనుకునే వాళ్లు వెళ్లొచ్చని అన్నారు. అలాంటి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం వస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లో సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకుముందు వరకు కూడా సచిన్ పైలట్కు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఇంకా తెరిచివున్నాయన్న కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications