భారత్ సిద్ధమేనా?: లాక్డౌన్ తర్వాత కరోనా కేసులు విజృంభించొచ్చన్న WHO
జెనీవా: ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్కు కోవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ నెబరో వ్యాఖ్యానించారు. అయితే, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
Recommended Video

భారత్ చర్యలు భేష్
కరోనా కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలను అభినందించకుండా ఉండలేనని డేవిడ్ నెబరో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు కరోనా బాధితులను గుర్తించడం, వారికి తగిన చికిత్స అందించే ప్రక్రియ బాగుందన్నారు. కరోనాను ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా మంచి చర్యలు చేపట్టిందన్నారు. ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటుందో తెలుసని అన్నారు.

ఇండియాలో లాక్డౌన్
లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు వైద్య సేవలు కూడా తగిన విధంగా అందించడంతో భారతదేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయని, మరణాలు కూడా ఎక్కువగా సంభవించలేదని డేవిడ్ నెబరో తెలిపారు. లాక్డౌన్ క్రమంగా ఎత్తివేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ఎత్తివేయడం వల్ల కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా కట్టడికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.

మహారాష్ట్ర పరీక్షలు..
లాటిన్ అమెరికా, ఆఫ్రికా చేసిన తప్పులే ఇండియాలోని మహారాష్ట్రలో జరుగుతున్నాయని, అందుకే కేసులు, మరణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయన్నారు డేవిడ్. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. మహారాష్ట్ర, ముంబైలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి కూడా ఇదే సూచిస్తున్నామని తెలిపారు. ముంబైలోని ధారావి లాంటి ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టంగా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, కరోనా కట్టడికి మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ధారావి ప్రాంతంలో మెరుగైన పరిస్థితులు ఉన్నాయని సమాచారం అందిందని తెలిపారు.












Click it and Unblock the Notifications