దేశంలో కరోనా ఉగ్రరూపం.. 1.60 లక్షల కొత్త కేసులు.. 10.21 శాతానికి పాజిటివిటీ రేటు
భారత్ లో రోజు రోజుకు కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో లక్షా 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
కొత్తగా 1,59, 632 కేసులు.. 327 మంది మృతి
దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 15,63,566 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 1,59, 632 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపింది. కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్న 327 మంది మరణించారు.
దీంతో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 4,83,790కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 5,90,611కు చేరింది. శనివారం 40,863 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,44,53,603కు చేరింది. గడిచిన 24 గంటల్లో 56,91,175 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 151.58 కోట్ల మందికి వాక్సిన్స్ ఇచ్చినట్లు వివరించింది.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికం
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 3,623కు చేరింది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1009కి చేరి తొలిస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఢిల్లీ 513, కర్ణాటక 441, రాజస్థాన్ 373, కేరళ 333, గుజరాత్ 204, తమిళనాడు 185, హరియాణ 123, తెలంగాణ 123, ఉత్తరప్రదేశ్ 113 కేసులకు చేరాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఫిబ్రవరిలో రోజు 5లక్షల కేసులు..
దేశంలో కరోనా వ్యాప్తి ఫిబ్రవరి 1-15 మధ్య ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. రోజుకు 5లక్షల కేసులు నమోదైయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలో ఒకరి నుంచి నలుగురికి కరోనా సోకుతున్నట్టుగా ఉందని పేర్కొంది. ఈ మహమ్మారి కట్టడికి ప్రజలు గుమిగూడకుండా కఠినతరం చేయడంతో పాటు క్వారంటైన్ను పక్కగా అమలు చేయాలని సూచించారు..